Share News

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:56 AM

పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు.

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

  • 3 వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

  • కొండగట్టు వద్ద కారును ఢీకొట్టిన వ్యాన్‌

  • మెదక్‌ జిల్లాలో బైక్‌ను ఢీకొన్న కారు

  • ఖమ్మంలో ద్విచక్రవాహనం పైకి లారీ

  • పెద్దపల్లి జిల్లాలో బైక్‌పైకి దూసుకెళ్లిన లారీ

  • మృతుల్లో రెండు జంటలు, తండ్రీకొడుకు

మల్యాల, మాసాయిపేట/చేగుంట, ఖమ్మం ఖానాపురం హవేలీ, సుల్తానాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు. మరో ఘటనలో బంఽధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యేందకు బైక్‌పై వెళుతూ దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైతే, ఇంకోచోట.. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదం బారిన పడి భార్యాభర్తలు మృతిచెందారు. ఇలా గరువారం మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లికొడుకు సోదరి కుమారుడైన వాగేరి రుద్ర (4 నెలలు) మృతిచెందాడు. పెళ్లి కుమారుడు మహేశ్‌ మెట్కార్‌, అతడి తండ్రి, సోదరి, బావ, అన్న కూతళ్లు ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని పెళ్లి మండపానికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా గురువారం జరగాల్సిన పెళ్లినిలిచిపోయింది.

28.jpg


మెదక్‌ జిల్లాలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు యాదగిరి (36), మంజుల (35) మృతిచెందారు. వీరి స్వస్థలం మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని రెడ్డిపల్లి. మాసాయిపేట మండలం రామంతపూర్‌లోని బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు జగదీశ్‌ (16), రామకృష్ణ (14) గుండెలవిసేలా రోదించారు. ఖమ్మంలో ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు అజ్మీరా బాల్య (45), సాయికృష్ణ (17) మృతిచెందారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సాయికృష్ణ ఇంటర్‌ కాలేజీ ఫీజు కట్టేందుకు బాల్య, సాయికృష్ణ కలిసి తమ సొంతూరు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బురుగుపాడు దుబ్బ తండా నుంచి బైక్‌ మీద బయలుదేరారు. ఖమ్మంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన గుంటిపల్లి రాములు (28), భార్య అనూష (25) మూడేళ్ళ కూతురు సహస్రతో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గురువారం రాత్రి బైక్‌పై బయలుదేరారు. సుగ్లాంపల్లి స్టేజీ వద్ద గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ డివైడర్‌ను దాటి బైక్‌ పైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అనూష, రాములు మృతిచెందారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 03:56 AM