Kaleshwaram Project: ఎల్ అండ్ టీ నుంచి ఖర్చు రాబట్టండి!
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:05 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నుంచి బ్లాక్-7 నిర్మాణ ఖర్చును వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది.

ఏడో బ్లాక్ నష్టాన్ని వసూలు చేయాలి.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టండి
33 మందిపై శాఖాపర చర్యలు.. 17 మందిపై అభియోగాలు మోపండి
ఏడుగురిపై జరిమానాలు.. ముఖ్య కార్యదర్శుల పైనా చర్యలు
మేడిగడ్డ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసులు
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నుంచి బ్లాక్-7 నిర్మాణ ఖర్చును వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది. ఈ మేర కు కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్(వీ అండ్ ఈ) విచారణ జరిపి, సమర్పించిన నివేదికను కమిషన్ ఆమోదించింది. మార్చి 5వ తేదీన విజిలెన్స్ తన నివేదికను కమిషన్కు అందించింది. తర్వాత అదే నెల 18వ తేదీన నివేదికను కమిషన్ యథాతథంగా ఆమోదించి, మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నుంచి బ్లాక్-7కు అయిన ఖర్చును తిరిగి రాబట్టాలని సిఫారసు చేసింది. కమిషన్ నివేదిక పూర్తి పాఠం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీని 8 బ్లాకులుగా, 85 పిల్లర్లతో నిర్మించారు. అంచనా వ్యయం రూ.4613 కోట్లు. ఇక ఏడో బ్లాకులో మొత్తం 11 పిల్లర్లు ఉండగా వాటి పునర్నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని ఎల్ అండ్ టీ నుంచి వసూలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ గత మార్చి 18వ తేదీన ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సిఫారసు చేశారు. ఇప్పటిదాకా మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ పునర్నిర్మాణ బాధ్యతను, ఖర్చును ఎల్ అండ్ టీ భరించాలని నీటి పారుదల శాఖ కోరుతూ వచ్చింది. తాజాగా రికవరీ చేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం గమనార్హం.
అంతేకాకుండా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ -పీఈఎస్ జాయింట్ వెంచర్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు ఉపక్రమించాలని కమిషన్ కోరింది. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పని పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా సరైంది కాదని గుర్తు చేసింది. సాగునీటి శాఖకు చెందిన 17 మంది అధికారులకు ఐపీసీలోని సెక్షన్-120(బీ), 336, 409, 418, 423, 426తోపాటు పీసీ యాక్ట్-1988, ఆనకట్టల భద్రత చట్టం-2021, పీడీపీపీ చట్టం-1984ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పింది. వీరిలో పదవీ విరమణ చేసిన ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్, మాజీ ఈఎన్సీ(ఓ అండ్ ఎం) భూపతి రాజు నాగేంద్రరావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఆర్థిక శాఖకు చెందిన డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ వి.ఫణి భూషణ్శర్మ, మాజీ ఈఎన్సీ(సీడీవో) ఎ.నరేందర్రెడ్డి, మాజీ సీఈ కె.ఎ్స.ఎ్స.చంద్రశేఖర్, ప్రస్తుత ఈఎన్సీ(ఓఅండ్ఎం) టి.శ్రీనివాస్ సహా 17 మంది ఉన్నారు. సి.మురళీధర్ పద వీ విరమణ చేసినప్పటికీ పదేళ్ల పాటు ఈఎన్సీ గా పని చేయడం గమనార్హం. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ సమయం(2015 ఏప్రిల్) నుంచి 2023 అక్టోబరు 21న మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగిపోయే దాకా పనిచేసిన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది. సహేతుక కారణాల్లేకుండా ప్రాజెక్టు రీ-డిజైన్ ప్రతిపాదనలు ఆమోదించిన నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీ పునాదుల్లో షీట్ పైల్స్ వాడాల్సి ఉండగా, సీకెంట్ పైల్స్ వినియోగించిన విషయం కమిషన్ ప్రస్తావించింది. అందులోనూ తీవ్రమైన లోపం జరిగిందని, ప్రైమరీ పైల్స్ వేసిన ఒకటి రెండు రోజుల్లో ఆర్సీసీ సీకెంట్ పైల్స్ వేయాల్సి ఉండగా జాప్యం చేయడంతోనే బ్యారేజీ వైఫల్యం చెందిందని తెలిపింది.
ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లు/క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించారని తెలిపింది. పాలనా అనుమతి ఇచ్చిన మొత్తానికి మించి 15శాతం అదనానికి అనుమతి ఇవ్వడానికి చీఫ్ ఇంజనీర్కు అనుమతి ఇచ్చినప్పటికీ, తను ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చి చేయాలని నిబంధన ఉందని, చీఫ్ ఇంజనీర్ సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొంది. మొదట్లో సవరించిన అంచనాల్లో కొన్ని పనులు చేయలేదని, అంచనాల్లో లేని పనులు చేసి బిల్లులు పొందారని, కొన్ని మంజూరు చేసిన పరిమాణం కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారని, రూ.1,343 కోట్ల డీవియేషన్కు చీఫ్ ఇంజనీర్ ఆమోదం తెలిపారని విజిలెన్స్ కమిషన్ వెల్లడించింది. 2018 జూన్ 23న రూ.3,260కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం రాగా, అంతకు ముందే 2018 జూన్ 14న రూ.1,343 కోట్ల డీవియేషన్కు ఆమోదం తెలిపారని గుర్తు చేసింది. నాణ్యత పరీక్షల విషయంలో 1,88,257 క్యూబిక్ మీటర్ల టెస్ట్ రిజిస్టర్లు లేవని, భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. బ్యారేజీలో నీటి నిల్వకు ముందు కాఫర్ డ్యామ్ తొలగించలేదని ప్రస్తావించింది. ఈ పని పూర్తి కాకముందే పూర్తయినట్లు 2021 మార్చి 15న ఈఈ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్లెయిమ్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
33 మందిపై అభియోగాలు
టీసీఎస్-1991 రూల్-24 ప్రకారం పదవీ విరమణ చేసిన వారితో పాటు సర్వీసులో ఉన్న 33 మందిపై అభియోగాలు నమోదు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. వీరిలో మాజీ ఈఎన్సీ బి.నాగేంద్రరావు, ప్రస్తుత ఈఎన్సీ టి.శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ వి.ఫణి భూషణ్శర్మతో కలిపి 33మందిపై అభియోగాలు నమోదు చేయాలని చెప్పింది. పదవీ విరమణ చేసిన మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గజ్జెల హరిహరచారి, మాజీ చీఫ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎస్ఈ గంగాధర్, మాజీ సీఈ అజయకుమార్, మాజీ ఈఎన్సీ నరేందర్రెడ్డిలు ఉన్నారు. వీరిపై అభియోగాల నమోదు తర్వాత మారిన పెన్షన్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని చెప్పింది.
రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యులకు మార్గదర్శకాలు జారీ చేయాలి. ఖజానాపై ఆర్థిక భారం తగ్గించడానికి వీలుగా స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, సభ్యులను బాధ్యులను చేయాలి. వీరు ప్రాజెక్టుల ఇంజనీర్లపై బాధ్యతను నెట్టి, తప్పించుకోకుండా చూసుకోవాలి.
కాంట్రాక్టర్ ఒప్పంద షరతులకు మించి... అదనంగా క్లెయిమ్ చేస్తే పరిగణనలోకి తీసుకోకూడదు.
డి జైన్లను ప్రారంభించడానికి ముందే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు కాంట్రాక్ట్ ప్రతుల కాపీ అందించాలి. నాణ్యత నియంత్రణ, నిర్మాణ అధికారులు.. నిర్మాణ స్థలాలను పరిశీలించి, సవరణ డ్రాయింగ్ ప్రతిపాదనలు సమర్పించాలి.
ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల సందర్శన బృందంలో సీడీవోను సభ్యుడిగా చేర్చాలి.
ఒకే ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ రిసేర్చ్ ల్యాబోరేటరీ(టీజీఈఆర్ఎల్) వేర్వేరు నివేదికలు ఇస్తే థర్డ్ పార్టీని ఆశ్రయించాలి.
బ్యారేజీల దిగువభాగంలో తదుపరినష్టం జరుగకుండా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయాలి.
సరైన శిక్షణలేని, కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నిర్మాణ కొలతల(ఎంబుక్) బా ధ్యత అప్పగిస్తే కొలతలుఎక్కువ, తక్కువగా రాశారు.
ఏయే సెక్షన్లు
ఐపీసీ-120(బి)ప్రకారం నేరపూరిత కుట్ర. 6 నెల్ల జైలు.
ఐపీసీ-336 ప్రకారం మానవ తప్పిదం. మూడునెలల శిక్ష లేదా జరిమానా.
ఐపీసీ-409 ప్రభుత్వ ఉద్యోగి నమ్మక ద్రోహం. యావజ్జీవ శిక్ష.
ఐపీసీ-418 మోసపూరితంగా ఇతరుల అభిప్రాయాలను ప్రభావితం చేయడం. మూడేళ్ల జైలు.
ఐపీసీ-423 చీకటి ఒప్పందంతో హక్కులు ఇవ్వడం. రెండేళ్ల జైలు. ఐపీసీ-426 తగిన కారణాల్లేకుండా నష్టం కలిగించడం. మూడు నెలల జైలు.
అవినీతి నిరోధక చట్టం మూడు నుంచి ఏడేళ్ల జైలు.
ఆనకట్టల భద్రత చట్టం-2021 జవాబుదారీతనం లేకపోవడం, రెండేళ్ల జైలు.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం నివారించే చట్టం 1984 ప్రకారం ఐదేళ్లు జైలు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News