Share News

Weather Update: 9 రోజుల ముందుగానే నైరుతి

ABN , Publish Date - May 14 , 2025 | 02:26 AM

నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్‌ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.

Weather Update: 9 రోజుల ముందుగానే నైరుతి

  • అండమాన్‌ను తాకిన రుతుపవనాలు

  • 27న కేరళలోకి ప్రవేశించే అవకాశం

  • జూన్‌ తొలి వారంలోనే తెలంగాణకు!

  • రాష్ట్రంలో నేడు, రేపు వర్షసూచన

  • వడదెబ్బకు నలుగురి మృతి

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఎండలతో మండుతున్న ప్రజలకు చల్లని కబురు! ఊహించిన దానికంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. కొద్ది రోజులుగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు మంగళవారం దక్షిణ, ఉత్తర అండమాన్‌ సముద్రం, అండమాన్‌, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవులు మొత్తం, అండమాన్‌ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్‌ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయి. అండమాన్‌ నికోబార్‌ ప్రాంతంలోని అనుకూల వాతావరణం ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి మరింత ముందుగా జూన్‌ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి మే 22న రుతుపవనాలు ప్రవేశించాలి. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో 9 రోజులు ముందుగానే వచ్చేశాయి. కేరళను ముందస్తుగా ఈ నెల 27వ తేదీనే (సాధారణ తేదీ జూన్‌ 1) నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలా జరిగితే 2009 తర్వాత అంచనాల కంటే ముందుగానే రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే కేరళలోకి ప్రవేశించాయి. మంగళవారం అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి 22 మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేశారు.


కాగా, బుధ, గురువారాల్లో తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, హైదరాబాద్‌లో భిన్న వాతావరణం నెలకొంటోంది. ఐదు రోజులుగా మధ్యాహ్నం 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడదెబ్బ తగిలి మంగళవారం ఖమ్మం జిల్లాలో ఇద్దరు, హనుమకొండ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.

అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్‌ యార్డులో విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ఎరన్‌పల్లి, హస్నాబాద్‌, అంగడిరైచూర్‌, పర్సాపూర్‌, పెద్దనందిగామ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న ధాన్యం తడిసిముద్దయింది.

Updated Date - May 14 , 2025 | 02:27 AM