QR Code: క్యూఆర్ స్కాన్తో చిటికెలో ట్రైన్ టికెట్.!
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:35 AM
ప్రయాణికులు రైల్వే టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరింత సులువైన మార్గాలను ప్రవేశపెడుతోంది. ఇకపై రైల్వేస్టేషన్లలో సాధారణ టికెట్లతో పాటు రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ చార్జీల చెల్లింపునకు మెరుగైన క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకువచ్చింది.

879 కంప్యూటర్లలో క్యూఆర్ను జోడించిన ద.మధ్య రైల్వే
ఇది పారదర్శకతకు మైలురాయి: జీఎం అరుణ్కుమార్ జైన్
హైదరాబాద్ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు రైల్వే టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరింత సులువైన మార్గాలను ప్రవేశపెడుతోంది. ఇకపై రైల్వేస్టేషన్లలో సాధారణ టికెట్లతో పాటు రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ చార్జీల చెల్లింపునకు మెరుగైన క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకువచ్చింది. జోన్ పరిధిలోని 879 కంప్యూటర్లలో ఆధునికీకరించిన క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక నుంచి చార్జీల చెల్లింపు కోసం ఫోన్ల ద్వారా ఆయా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి టికెట్లను సులువుగా పొందవచ్చని చెప్పారు.
అన్ని వివరాలను సిస్టమ్లో నమోదు చేశాక చెల్లింపును అంగీకరించే ముందు, క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుందని వెల్లడించారు. తద్వారా మొబైల్ ఫోన్లో ఉన్న చెల్లింపు యాప్ల ద్వారా ప్రయాణికులు దానిని స్కాన్ చేసి టికెట్లను పొందవచ్చని తెలిపారు. ఈ విధానం పారదర్శకతకు మైలు రాయిగా నిలుస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.