Jagga Reddy: సోనియా, రాహుల్ కుటుంబానిది త్యాగాల చరిత్ర
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:54 AM
దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్ భవన్ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు.

దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు ఇచ్చారు
మన్మోహన్ను ప్రధాన మంత్రిని చేశారు
నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ
అర్థ రహిత ఆరోపణలు: జగ్గారెడ్డి సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
సంగారెడ్డి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్ భవన్ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో బీజేపీ ఆరోపిస్తున్న అక్రమాల విలువ ఆ స్వరాజ్ భవన్ కిటికీలు, దర్వాజాలకు కూడా సరితూగదని అన్నారు. గురువారం సంగారెడ్డి పోస్టాఫీసు కేంద్ర కార్యాలయం వద్ద జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు.
ప్రధాని పదవి కోసం ఎల్కే అద్వానీని మోదీ అవమానిస్తే.. అదే ప్రధాని పదవిని మన్మోహన్సింగ్కు త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ గాంధీదని కొనియాడారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని అవమానిస్తుంటే ఆర్ఎ్సఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. తనను చంపడానికి వచ్చిన పామును సైతం సముదాయించి అడవిలో వదిలేసే గుణం రాహుల్ గాంధీదైతే.. ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగే పాములను కొట్టి చంపే గుణం మోదీ, అమిత్షాదని దుయ్యబట్టారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారో తెలుసన్నారు. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజలను చైతన్యం చేసే దిశగా పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్ అని.. ఆ సమయంలో మోదీ, అమిత్షాలు పుట్టనేలేదన్నారు. వారికి స్వాతంత్య్ర పోరాటంతో సంబంధమే లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.