Share News

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌ ఆక్రమణల కూల్చివేత

ABN , Publish Date - May 07 , 2025 | 03:36 AM

గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌  ఆక్రమణల కూల్చివేత

  • గచ్చిబౌలిలో దాదాపు అర ఎకరం కబ్జా

  • ప్లాట్ల యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా

  • రూ.40 కోట్ల విలువైన స్థలంలో ఆక్రమణల తొలగింపు

  • గాజులరామారంలో 15 ఎకరాల సర్కారీ భూమి స్వాధీనం

  • అక్రమ నిర్మాణాలను తొలగించి.. ఫెన్సింగ్‌ వేసిన హైడ్రా

హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): సంధ్య కన్వెన్షన్‌ ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లే అవుట్‌లో సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ప్రజావాణిలో పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు.. అనుమతి లేకుండా నిర్మించిన సంధ్య కన్వెన్షన్‌ మినీ హాల్‌తోపాటు ప్రధాన కన్వెన్షన్‌ను ఆనుకొని నిర్మించిన వంటగదులు, పది రెస్ట్‌ రూంలను కూల్చివేశారు. జీ+2 అంతస్తులున్న మరో రెండు ఐరన్‌ నిర్మాణాలనూ నేలమట్టం చేశారు. దాదాపు అరెకరం స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. గచ్చిబౌలిలోని ఈ భూమి విలువ సుమారు రూ.40 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి గ్రామం పరిధిలోని 20 ఎకరాల్లో 162 ప్లాట్లతో 1980లో లే అవుట్‌ను అభివృద్ధి చేశారు. గతంలో ప్లాట్లు కొన్న కొందరు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. కొందరు ప్లాట్లను ఇతరులకు విక్రయించారు. సంధ్య కన్వెన్షన్‌ నిర్మాణం చేపట్టిన శ్రీధర్‌రావు పక్కనే ఉన్న లే అవుట్‌లోని తమ ప్లాట్లను ఆక్రమించారని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రహదారులు, ప్లాట్ల సరిహద్దులు లేకుండా చేశారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు లే అవుట్‌లో స్థలం ఆక్రమించినట్టు నిర్ధారణకు వచ్చారు. విషయాన్ని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. లే అవుట్‌ ఆక్రమణలకు సంబంధించి శ్రీధర్‌రావుపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఐదు కేసులు నమోదైనట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. ఇతరత్రా అంశాలకు సంబంధించి ఆయనపై 30 వరకు కేసులున్నట్టు ప్లాట్ల యజమానులు చెబుతున్నారు.


గాజుల రామారంలో 15 ఎకరాలు..

కుత్బుల్లాపూర్‌ మండలంలోని గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా విడిపించింది. సర్వే నంబరు 354లో ఉన్న సర్కారీ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చివేసింది. ఇందులో కేఎల్‌ యూనివర్సిటీ ఆక్రమించిన 5 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని రాజీవ్‌ స్వగృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేటాయించింది. అక్కడ నిర్మాణాలు చేయకపోవడంతో భూమిపై స్థానిక నాయకుల కన్ను పడింది. ప్రహారీలు నిర్మించుకొని, షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు.. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించి, కమిషనర్‌ రంగనాథ్‌కు నివేదిక అందజేశారు. ఆయన కూడా భూమిని స్వయంగా పరిశీలించారు. సర్కారీ భూమి అని తేలడంతో ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసిన అధికారులు సర్కారీ స్థలం అని బోర్డులు పెట్టి, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కాటేదాన్‌లో కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇందిరా సొసైటీ కాలనీలో రోడ్డు ఆక్రమణలు తొలగించింది.

Updated Date - May 07 , 2025 | 03:37 AM