Share News

Eye Cancer: క్యాన్సర్‌ ‘కన్నె’ర్ర

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:18 AM

క్యాన్సర్‌ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం.

Eye Cancer: క్యాన్సర్‌ ‘కన్నె’ర్ర

  • పెరుగుతున్న కంటి క్యాన్సర్‌ కేసులు

  • పిల్లలపై రెటినోబ్లాస్టోమా ప్రభావం

  • ఎల్వీ ప్రసాద్‌కు ఏటా 500 కొత్త కేసులు.. వెయ్యి ఫాలో అప్‌ కేసులు

  • ముందే గుర్తిస్తే మంచిది: డాక్టర్లు

  • పెరుగుతున్న కంటి క్యాన్సర్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే, ఇప్పుడు కంటి క్యాన్సర్‌ కేసులూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోవడం, ప్రాణాలకు ముప్పు వాటిల్లడం జరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కంటి కాన్సర్‌ అరుదైనప్పటికీ, సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. శాశ్వతంగా చూపు పోయే, కంటిని పూర్తిగా తీసివేసే ముప్పు ఉంటుందని ఎల్‌.వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహనా లోపం వల్ల చాలా కేసులు తీవ్రమైన దశకు చేరేదాకా గుర్తించలేకపోతున్నారని ఎల్వీపీఈఐ ఆక్యులర్‌ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ స్వాతి తెలిపారు. ఎల్వీపీఈఐలో ఏటా దాదాపు 500 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతుండగా, వెయ్యి వరకు ఫాలో అప్‌ కేసులు ఉంటున్నాయని, మూడు వందల సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. పిల్లల్లో రెటినోబ్లాస్టోమా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని చెప్పారు.


పెరుగుతున్న రెటినోబ్లాస్టోమా కేసులు

పిల్లలలో ప్రాణాంతకమైన కంటి కాన్సర్‌ రెటినోబ్లాస్టోమా. ఇది ఇతర దేశాలకంటే భారతదేశంలో ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వైద్యులు వివరించారు. సాధారణ కంటి కాన్సర్లలో ఆక్యులర్‌ సర్ఫేస్‌ స్క్వామస్‌ నియోప్లాసియా(ఓఎ్‌సఎ్‌సఎన్‌), సెబాసియస్‌ గ్లాండ్‌ కార్సినోమా పెద్దవారిలో కనిపిస్తున్నాయన్నారు. పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఓఎ్‌సఎ్‌సఎన్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. సెబాసియస్‌ గ్లాండ్‌ కార్సినోమా, కనురెప్పల క్యాన్సర్‌ కేసులూ నమోదవుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. జన్యుపరమైన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గడం, ధూమపానంవంటి కారణాలు వల్లకంటి కాన్సర్లు పెరగుతున్నాయని చెప్పారు.


ఇవీ లక్షణాలు

పిల్లల కంటిలో ఒక తెల్లని మచ్చ ఏర్పడటం రెటినోబ్లాస్టోమాకు సంకేతం; చెదిరిన చూపు లేదా ఉన్నట్టుండి చూపు పోవడం;కంటిలోని ఐరి్‌సపై నల్ల మచ్చ పెరగడం; కంటి ఆకారంలో అకస్మాత్తుగా మార్పు, ఒక కన్ను ఉబ్బడం;కనురెప్పపై, కంటి చుట్టూ గడ్డ ఏర్పడటం; కన్ను ఎరుపెక్కడం, వాపు, దీర్ఘకాలంగా చికాకు ఉండటం; కంటిలో, కంటి చుట్టూ నొప్పి అనిపించడం

సమస్య ఉంటే పరీక్షలు తప్పనిసరి..

కంటిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనిస్తే ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. కంటిచూపులో ఉన్నట్టుండి ఏదైనా మార్పు వచ్చినా, కంటి వాపు ఉన్నా అప్రమత్తం అవ్వాలి. ఏ లక్షణాలూ లేకపోయినా కంటి పరీక్ష చేయించుకోవడం వల్ల కాన్సర్‌ను ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. త్వరగా గుర్తిస్తే రెటినోబ్లాస్టోమాను నయం చేయవచ్చు.

- డాక్టర్‌ స్వాతి, ఆక్యులర్‌ ఆంకాలజీ విభాగం అధిపతి, ఎల్వీపీఈఐ


ఈ వార్తలు కూడా చదవండి:

Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 12 , 2025 | 04:18 AM