Tata Advanced Systems: హైదరాబాద్లో రాఫెల్!
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:30 AM
రాఫెల్ యుద్ధవిమానాలకు అవసరమైన ఫ్యూస్లాజ్ను(విమాన మధ్య భాగాన్ని) ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్సఎల్) సంస్థ వీటిని తయారు చేయనుంది.

యుద్ధవిమానాల ఫ్యూస్లాజ్ తయారీకి
టాటా సంస్థతో దసో ఒప్పందం
కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎ్సఎల్
నెలకు రెండు ఫ్యూస్లాజ్ల తయారీ లక్ష్యం
తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి!
న్యూఢిల్లీ, జూన్ 5: రాఫెల్ యుద్ధవిమానాలకు అవసరమైన ఫ్యూస్లాజ్ను(విమాన మధ్య భాగాన్ని) ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్సఎల్) సంస్థ వీటిని తయారు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్తో టీఏఎ్సఎల్ 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్యూస్లాజ్ తయారీ కేంద్రాన్ని టీఏఎ్సఎల్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నౌకాదళానికి రాఫెల్ మెరైన్ జెట్లు అందజేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఈ ఏడాది ఏప్రిల్లో రూ.64 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాని ప్రకారం రాఫెల్ జెట్ల బాడీ ఉత్పత్తికి ఒక కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. దాన్నే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూస్లాజ్ సహా కీలక సామగ్రిని తయారు చేస్తారు. విమానానికి ఫ్యూస్లాజ్ అత్యంత కీలకమైన భాగం. ఇది సిలిండర్ ఆకారంలో ఉంటుంది. విమానాల వినియోగాన్ని బట్టి ఫ్యూస్లాజ్ను డిజైన్ చేస్తారు. 2028 ఆర్థిక సంవత్సరానికల్లా ఫ్యూస్లాజ్ తయారీని హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. నెలకు రెండు ఫ్యూస్లాజ్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఈ ఫ్యూస్లాజ్లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయనుండడం ఇదే తొలిసారి. ఇది రక్షణ ఉత్పత్తుల తయారీలో ‘మేకిన్ ఇండియా’కు ఊతమిచ్చే ప్రాజెక్టు అని నిపుణులు పేర్కొంటున్నారు.
మరింత వేగంగా ‘రాఫెల్’ సరఫరా
భారత్లో తమ సరఫరా ప్రక్రియను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయాత్మక అడుగు వేసినట్లు దసో ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ చెప్పారు. తమతో కలిసి పనిచేస్తున్న టీఏఎ్సఎల్కు కృతజ్ఞతలు చెప్పారు. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో టీఏఎ్సఎల్ ప్రధాన సంస్థగా ఉందన్నారు. రాఫెల్ యుద్ధవిమానాలను మరింత వేగంగా సరఫరా చేయడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. భారత ఏరోస్పేస్ రంగంలో దసోతో తమ భాగస్వా మ్యం కీలక అడుగు అని టీఏఎ్సఎల్ సీఈవో, ఎండీ సుకరణ్ సింగ్ చెప్పారు. టీఏఎ్సఎల్ సామర్థ్యాలపై నమ్మకం ఉండబట్టే దసో ఏవియేషన్ రాఫెల్ ఫ్యూస్లాజ్ తయారీ బాధ్యతలను అప్పగించిందని ఆయన తెలిపారు.