Share News

Prabhakar Rao: నాటి డీజీపీ, ఐజీ ఆదేశంతోనే ట్యాపింగ్‌!

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:25 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాల మేరకే తాను ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించానని సిట్‌ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం.

Prabhakar Rao: నాటి డీజీపీ, ఐజీ ఆదేశంతోనే ట్యాపింగ్‌!

మహేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ చెప్పినందుకే.. సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు వెల్లడి!

  • మూడోరోజు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ విచారణ

  • మావోయిస్టుల పేరు చెప్పి.. నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లట్యాపింగ్‌

  • ఎవరి ఆదేశాలతో ప్రముఖుల నంబర్లిచ్చారు

  • ప్రభాకర్‌రావును ప్రశ్నించిన సిట్‌

  • ప్రణీత్‌ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాల మేరకే తాను ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించానని సిట్‌ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. శనివారం మూడో రోజు సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లోని సిట్‌ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్‌రావును డీసీపీ విజయకుమార్‌, ఏసీపీ వెంకటగిరి దాదాపు 9గంటలపాటు ప్రశ్నించారు. మావోయిస్టుల పేరు చెప్పి.. పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్‌ చేయించినట్లు, ఇందుకు అనుమతి కోసం హోంశాఖకు తప్పుడు సమాచారం పంపించినట్లు గుర్తించిన సిట్‌ అధికారులు.. శనివారం ప్రభాకర్‌రావును ఇదే అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్‌రావును ప్రశ్న అడిగిన తర్వాత.. ఆయనిచ్చిన సమాధానం తప్పయితే తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రభాకర్‌రావు ఉన్నతాధికారుల కళ్లు గప్పడానికి అనుసరించిన వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నారని సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు ఉన్నతాధికారులను ఇందులోకి లాగే దిశగా ప్రభాకర్‌రావు సమాధానాలిచ్చినట్లు, మరికొన్నిసార్లు మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది.


హోంశాఖకు తప్పుడు సమాచారం..

మావోయిస్టుల పేర్లు చెప్పి కొందరు ప్రముఖులకు సంబంధించిన కాల్‌ డిటైల్‌ రికార్డులు(సీడీఆర్‌), ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డిటైల్‌ రికార్డులు(ఐపీడీఆర్‌) సేకరించారని, వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అనధికార ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్వహించినట్లు సిట్‌ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా ఆధారాలతో ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్లు సమాచారం. తప్పుడు సమాచారంతో హోంశాఖ నుంచి అనుమతి కోరినవి కొన్ని కాగా, అనధికారికంగా వందల్లో ప్రొఫైళ్ల తయారీ జరిగింది. ఈ నేపథ్యంలో, ‘‘ఎవరి అండదండలతో మీరు ఇవన్నీ చేశారు? మీకు ఆదేశాలిచ్చింది ఎవరు? ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా మీరు ఎందుకు వ్యవహరించారు?’’ అని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాలనే తాను పాటించానని ప్రభాకర్‌రావు చెప్పినట్లు సమాచారం. కాగా, ప్రభాకర్‌రావు బృందం నుంచి హోంశాఖకు వెళ్లిన విజ్ఞప్తుల్లో 70 శాతం తప్పుడు సమాచారమని సిట్‌ అధికారులు విచారణలో నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఆయా విషయాల ఆధారంగా ప్రభాకర్‌రావుపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తొలిరోజు విచారణలో తన పై అధికారులకు అన్నీ తెలునునని, రాతపూర్వక అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ప్రభాకర్‌రావు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇచ్చిన విషయాన్ని సిట్‌ అధికారులు బయటపెట్టడంతో ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.


ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల్లోనే డేటా ధ్వంసం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారం చేపట్టనున్న క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన గంటల వ్యవధిలోనే ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. ఎస్‌ఐబీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలను ఆపి వేసి ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారు. దాదాపు 1200 పేజీల ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రొఫైళ్లను దహనం చేశారు. పలుహార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో ధ్వంసం చేశారు. కొన్ని హార్డ్‌ డిస్క్‌ల ముక్కలను మూసీలో పడవేశారు. దీంతో ఇదంతా ఎందుకు చేశారు? ఎవరు ఆదేశాలిచ్చారు? అని ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించినపుడు.. తన బాస్‌ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే చేశానని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు నిరాకరించడంతో ప్రణీత్‌రావుతో డేటా ధ్వంసానికి ముందు ఏ సమయంలో ఫోన్‌లో మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడుకున్నారు? అన్న వివరాలను ప్రభాకర్‌రావు ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ చేయించినట్లు కొంతవరకు ప్రభాకర్‌రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. డేటా ధ్వంసానికి సంబంధించి నిబంధనలను పాటించలేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారని సమాచారం. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ నుంచి అందిన ముఖ్యమైన రిట్రీవ్‌ డేటా ఆధారంగా కూడా ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. తదుపరి విచారణలో ప్రభాకర్‌రావుతో పాటు ప్రణీత్‌రావును కలిపి విచారించాలని సిట్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


17న మళ్లీ ప్రభాకర్‌రావు విచారణ

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆదివారం నుంచి బాఽధితుల వాగ్మూలాలను నమోదు చేసేందుకు సిట్‌ సిద్ధమైంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, విలేకరులను పిలిచి వారి వాంగ్మూలాలను సిట్‌ నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరుకావాలని ప్రభాకర్‌రావుకు సిట్‌ అధికారులు నోటీసు పంపారు. ఆయన వినియోగించిన ఫోన్లను కూడా అధికారులు సీజ్‌ చేయనున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 03:25 AM