Share News

IT Employees: పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్‌ మత్తు

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:20 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు.

IT Employees: పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్‌ మత్తు

  • ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్టు

  • 3 కార్లు, మద్యం బాటిళ్లు, డ్రగ్స్‌ స్వాధీనం

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘటన

మొయినాబాద్‌ల, ఆగస్టు3 ( ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో డ్రగ్స్‌ తీసుకున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభిజిత్‌ అనే ఐటీ ఉద్యోగి తన పుట్టినరోజు వేడుకల కోసం మేడిపల్లి రెవెన్యూలోని ఓ ఫాం హౌస్‌ను బుక్‌ చేసుకున్నాడు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి అతడి మిత్రులు హాజరయ్యారు. వీరంతా కలిసి మద్యం, డ్రగ్స్‌తో విందు చేసుకుంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఫాంహౌ్‌సపై దాడి చేశారు.


ఈ దాడుల్లో అభిజిత్‌తో పాటు పార్టీలో పాల్గొన్న సిమ్‌సన్‌, పార్థు, గోయల్‌, యశ్వంత్‌, సివోడెనీస్‌ అనే మరో ఐదుగురు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫాంహౌస్‌ యజమానిపైనా కేసు నమోదు చేసినట్లు చేవెళ్ల ఎక్సైజ్‌ సీఐ శ్రీలత తెలిపారు. ఘటనా స్థలంలో 0.05 గ్రాముల ఎల్‌ఎ్‌సడీ, 2.21 గ్రాముల హషీష్‌, మద్యం బాటిళ్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పారిపోయినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 04 , 2025 | 05:20 AM