Kishan Reddy: అమృత్ ఆవిష్కరణ
ABN , Publish Date - May 23 , 2025 | 04:22 AM
అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.

బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను బికనీర్ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో ఎంఎంటీఎస్-2 పనులు షురూ
త్వరలో యాదగిరిగుట్ట మార్గంలోనూ మొదలు
దసరాకు కొమురవెల్లి స్టేషన్ సిద్ధం: కిషన్రెడ్డి
జమ్మికుంటనూ అమృత్లో చేరుస్తాం: సంజయ్
రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం హర్షణీయం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్/బేగంపేట/కరీంనగర్/గిర్మాజిపేట, మే 22 (ఆంధ్రజ్యోతి): అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఆయన ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్టేషన్లను వర్చువల్గా ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ను రూ.25 కోట్లతో ఎయిర్పోర్టు తరహా సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతులను కిషన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్లో ఒకేసారి 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో తెలంగాణలో 40 స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. కొమురవెల్లి స్టేషన్ను ఈ ఏడాది దసరాకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఆలస్యమైందని విమర్శించారు. రూ.1,000 కోట్లతో ఎంఎంటీఎస్ ఫేజ్-2 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైందని, సుమారు రూ.400 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రైలు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద 617 కి.మీ. మేర కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి, ప్రారంభించడం హర్షనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ఎంఎంటీఎస్ ఫేజ్-2ను వేగవంతం చేయాలని కోరారు. కరీంనగర్-హసన్పర్తి రైల్వే లైన్పై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ మార్గంలో 61 కి.మీ. నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామని తెలిపారు. ఈ లైన్ నిర్మాణానికి రూ.1,480 కోట్లు అవుతుందని డీపీఆర్లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ఎంతో అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలో మరో ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది అమృత్ రైల్వే స్టేషన్ పథకమని అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణ ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్-కృష్ణా, కల్వకుర్తి-మాచర్ల, డోర్నకల్-గద్వాల కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News