మైనార్టీలపై దాడులు పెరుగుతున్నా యూపీ సర్కారు మౌనమెందుకు?
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:14 AM
ఉత్తరప్రదేశ్లో మైనార్టీ వర్గాలే లక్ష్యంగా దాడులు, దౌర్జాన్యాలు పెచ్చుమీరుతున్నాయని మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిలదీత
హైదరాబాద్, జులై 2(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్లో మైనార్టీ వర్గాలే లక్ష్యంగా దాడులు, దౌర్జాన్యాలు పెచ్చుమీరుతున్నాయని మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. కన్వర్ యాత్ర సందర్భంగా ముజఫర్నగర్ ప్రాంతంలోని హోటళ్ల సిబ్బందిని అల్లరిమూకలు వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. ‘ముజఫర్నగర్ సమీపంలో హోటళ్లలోని సిబ్బంది మతాన్ని నిరూపించుకునేందుకు ఆధార్ కార్డులు చూపాలని.. లేని పక్షంలో ప్యాంట్ విప్పాలని దుర్మార్గంగా వ్యవహరించే అల్లరిమూకలను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు.
భారతీయ సనాతన్ సురక్ష దళ్ అనే స్వయం ప్రకటిత సంస్థకు చెందిన ఓ గ్రూప్ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతోంది. కన్వర్ యాత్ర మార్గాల్లో దుకాణదారులు తమ పేర్లను ప్రదర్శించాలన్న యూపీ సర్కారు ఆదేశాన్ని గతంలోనే సుప్రీంకోర్టు నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది’ అని వ్యాఖ్యానించారు.