Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:43 PM
Nandamuri Balakrishna Padma Bhushan Award: కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బసవతారకం ఆస్పత్రి సిబ్బంది బాలయ్యకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్, జనవరి 31: ‘మా నాన్న గారి ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్ వచ్చింది’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం నాడు బసవతారకం ఆస్పత్రిలో బాలయ్యకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పద్మ భూషణ్ తనను వరించిందన్నారు. పదవులు మనకు అలంకారం కాదని.. మనకు పదవులు అలంకారం కావాలని అన్నారు. తాను ఎప్పుడూ ఏదీ ఆశించి చేయలేదన్నారు. ఇది తన నాన్న ఆశీర్వాదం అని పేర్కొన్నారు. ఇలాంటి సన్మానాలు మరింత బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఇంకా చాలా విషయాలు బాలయ్య మాట్లాడారు.
బాలకృష్ణ ఏం మాట్లాడారంటే..
‘నాకు వచ్చిన ఈ అవార్డు మీకు అందరికి వచ్చినట్లే. ఈ రోజు నాకు వచ్చిన అవార్డు రేపు మీకు రావచ్చు. స్వంత లాభం కొంత మానుకొని సమాజం కోసం పని చేయండి. వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవటం, వరుసగా మూడుసార్లు గెలవటం, ఇప్పుడు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. నా కుటుంబం అయిన.. బసవతారకం, హిందూపూర్ నియోజకవర్గం ప్రజలు వారికి అవార్డు వచ్చినట్లు భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం అయితే ఇలాంటి కుటుంబం దొరుకుతుంది. కాలం మారుతుంది. కాన్సర్ పెరుగుతుంది. దానికి తగ్గట్లుగా మనం పయనించాలి. కొత్త మెషినరీస్కి స్వాగతం పలకాలి. మా అమ్మ గారి ఆశయం కోసం ఎంతో మందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాం. సహకారం అందిస్తున్న దాతలకి, ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి కృతజ్ఞతలు. కళారంగానికి చేసిన సేవలు మరువలేనిది. దానికి గుర్తింపే ఈ గొప్ప అవార్డు. ఏ సినిమా చేసినా ఎంతో ఆలోచించి చేస్తాం. ఈ అవార్డు మా నాన్న, అమ్మకి అంకితం. మా నాన్న ఎన్నో సేవలు చేశారు. ఆయనకి భారతరత్న రావాలి.’ అని బాలకృష్ణ అన్నారు.
అడ్వాన్స్డ్ రోబోటిక్ డివెన్సీ ఎక్విప్మెంట్ ప్రారంభం..
పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణకు బలవతారకం ఆస్పత్రిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, వసుంధర దంపతులు హాజరయ్యారు. బసవతారకం హాస్పిటల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ డివెన్సీ ఎక్విప్మెంట్ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత తక్కువ పెయిన్తో ఖచ్చితమైన వైద్యం అందించే వీలుంటుందని చెప్పారు. శస్త్ర చికిత్సలో అత్యాధునిక వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయంలో గర్వపడుతున్నామని పేర్కొన్నారు. 800 లకు పైగా రోబోటిక్ సర్జరీలు చేశామని బాలకృష్ణ తెలిపారు. దేశంలోనే ఇన్ని రోబోటిక్ సర్జరీలు చేసిన ట్రస్ట్ ఒక్క బసవతారకం హాస్పిటల్ మాత్రమేనని చెప్పారాయన. కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే యాభై శాతం తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ రోగులు త్వరగా కోలుకుంటారని.. సంకల్పం, సేవ బలంతో ముందుకు సాగుతున్నామని బాలయ్య పేర్కొన్నారు.
Also Read:
తెలివైన వ్యక్తులు ఈ విషయాలను ఎప్పుడూ పంచుకోరు..
For More Telangana News and Telugu News..