Share News

Komatireddy: ఎమ్మెల్యే కోసం యువకులు వీరంగం.. ఎందుకంటే..

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:25 PM

మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వరా అంటూ ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ సదరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కారు.

Komatireddy: ఎమ్మెల్యే కోసం యువకులు వీరంగం.. ఎందుకంటే..

నల్గొండ, జూన్ 11: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు లోనయ్యారు. ఆ క్రమంలో చండూరులో ఇద్దరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే.. తాము వాటర్ ట్యాంక్‌ పైనుంచి దూకేస్తామంటూ యువకులు బెదిరించారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని వారిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం నాడు స్పందించారు. ముందుగా మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 'తెలంగాణ కేబినెట్‌లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నా. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.


ఈ రోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకూ తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పని చేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నా' అని అన్నారు.


ఇంతకీ ఏమైందంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను ఇటీవల పునర్వ్యవస్థీకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కొత్త వారికి ఆ కేబినెట్‌లో చోటు కల్పించారు. అయితే ఈ కేబినెట్‌లో తమకు చోటు దక్కుతోందంటూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆశించారు. కానీ వారికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో వారంతా తీవ్ర నిరాశ చెందారు. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు.. సదరు ఆశావాహుల ఇళ్లకు వెళ్లి బుజ్జిగించిన సంగతి తెలిసిందే.


ఇక ఈ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఉన్నారు. ఆయన కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన్ని సైతం పార్టీ పెద్దలు బుజ్జగించినట్లు సమాచారం. అదీకాక రేవంత్ రెడ్డి కేబినెట్‌లో పలువురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాజికవర్గాల సమీకరణాల దృష్ట్యా వివిధ వర్గాల వారికి ఈ కేబినెట్‌లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురికి కేబినెట్‌లో చోటు కల్పించింది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో మూడు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వాటినీ భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం

For Telangana News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 07:25 PM