Kavitha Nalgonda Visit: ఎక్కడి సమస్యలు అక్కడే.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై కవిత విసుర్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:23 PM
నల్గొండ జిల్లాలో కవిత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసి హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. తనకు కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదని.. కానీ హోర్డింగ్లను తొలగించారంటూ కవిత్ ఫైర్ అయ్యారు.
నల్లగొండ, నవంబర్ 12: గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో జిల్లాకు కృష్ణా జలాలు అందాయో లేదో ఆలోచించాలని అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్ను ఒక్క మాట అనరని.. ప్రాజెక్టుల పరిశీలనలో తాము వెళ్తే నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. నల్గొండ జీజీహెచ్ మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవన్నారు. ఐసీయూలో ఒక్కో బెడ్కు ఇద్దరిని పడుకోబెడుతున్నారని తెలిపారు. ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు లేకపోవడం బాధాకరమని కవిత అన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. భూదాన్ భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేదని నిలదీశారు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ ఏపీ చేతిలో ఉందని.. లెఫ్ట్ బ్యాంక్ పూర్తిగా సెంట్రల్ చేతులో పెట్టారన్నారు. సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని... అందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులు పెడుతోన్న నిబంధనలను సడలించాలన్నారు.
కాగా.. ఈరోజు నల్గొండ పట్టణంలో పర్యటించిన కవిత.. .జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే కవిత పర్యటన నేపథ్యంలో నల్గొండలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలను జాగృతి నాయకులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే హోర్డింగ్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై కవిత స్పందిస్తూ.. నల్గొండలో కోమటిరెడ్డికి తనకు పంచాయతీ లేదని.. కానీ తన ఫ్లెక్సీలు తొలగించారని మండిపడ్డారు. అరెస్టు చేసిన జాగృతి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు నల్గొండ వచ్చానని... పాలిటిక్స్ చేసేటప్పుడు గట్టి వాళ్లనే జాగృతి పోటీలో నిలబెడుతోందని అన్నారు. జాగృతి నాయకులతో పెట్టుకున్నోళ్లు బాగుపడలేదని కవిత వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
Read Latest Telangana News And Telugu News