Share News

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

ABN , Publish Date - May 13 , 2025 | 04:25 AM

ఉపాధి కోసం సౌదీ అరేబియాకెళ్లి అనారోగ్యంతో బాధ పడుతున్న నిజామాబాద్‌ జిల్లా వాసి.. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి చొరవతో స్వదేశానికి బయలుదేరారు.

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, మే 12 : ఉపాధి కోసం సౌదీ అరేబియాకెళ్లి అనారోగ్యంతో బాధ పడుతున్న నిజామాబాద్‌ జిల్లా వాసి.. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి చొరవతో స్వదేశానికి బయలుదేరారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు వాసి ముగ్గిడి బాలకిషన్‌ (38).. సౌదీ అరేబియాలోని రియాద్‌ నగరంలో ఓ వ్యక్తి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మెదడు నరాల సంబంధ వ్యాధితో బాద పడుతున్న బాలకిషన్‌ నాలుగు నెలల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో తాను పని చేస్తున్న ఇంట్లోనే కింద పడిపోయాడు. ఈ సంగతి గమనించిన అతడి యజమాని సొంత ఖర్చులతో ఆస్పత్రికి తరలించారు. మెదడు సంబంధ నరాల వ్యాధికి అత్యంత ఖరీదైన చికిత్స కూడా చేయించడంతో బాలకిషన్‌ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.


తమ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న బాలకిషన్‌ను వెనక్కు రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డిని వేడుకున్నారు. దీంతో స్పందించిన రాకేశ్‌ రెడ్డి.. రియాద్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించారు. సౌదీ అరేబియాలోని సామాజిక సేవా కార్యకర్తలను సంప్రదించి బాలకిషన్‌ను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు అబ్దుల్‌ జబ్బార్‌, భారత ఎంబసీ అధికారులు, సౌదీ యజమాని మధ్య సమన్వయం ఫలించడంతో బాలకిషన్‌ సోమవారం స్వదేశానికి బయలుదేరారు.

Updated Date - May 13 , 2025 | 04:25 AM