Share News

Miss World 2025: రూ. 8.5 కోట్ల నగదు.. 1770 వజ్రాల కిరీటం

ABN , Publish Date - May 31 , 2025 | 03:37 AM

అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది.

Miss World 2025: రూ. 8.5  కోట్ల నగదు..  1770 వజ్రాల కిరీటం

  • ప్రపంచ సుందరికి అందే నజరానాలు.. ఏడాదిపాటు ఉచితంగా ప్రపంచ యాత్ర

  • ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో.. ప్రస్తుతం పోటీలో 40 మంది

  • ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్‌ పైనే..

  • 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం

  • హైటెక్స్‌లో 4వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు

  • భారత్‌ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు

నేడే మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది. ప్రపంచ సుందరి విజేతకు మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8.5 కోట్లు) నగదుతోపాటు 1,770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాదు మిస్‌ వరల్డ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి.


ఎంపిక ప్రక్రియ జరిగేది ఇలా..

ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు 108 దేశాలకు చెందిన సుందరీమణులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్‌ ఫైనల్‌కు ఎంపిక చేశారు. అందులో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్కో విభాగం నుంచి నలుగురు చొప్పున 16 మంది విజేతల పేర్లను ప్రకటించారు. అమెరికా-కరేబియన్‌ విభాగం నుంచి ట్రినిడాడ్‌-టొబాగో, మార్టినిక్‌, ప్యూర్టోరికో, డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశాలవారు.. ఆఫ్రికా విభాగం నుంచి జాంబియా, నమీబియా, ఉగాండా, కామెరూన్‌వారు.. యూరప్‌ నుంచి ఎస్తోనియా, వేల్స్‌, ఐర్లాండ్‌, మోంటెనెగ్రోవారు.. ఏషియా-ఓషియానా నుంచి భారత ప్రతినిధి నందినీ గుప్తాతోపాటు తుర్కియే, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా భామలు ఉన్నారు. మొత్తంగా తుది పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 10మంది చొప్పున 40 మంది ఉంటారు. ఇప్పటికే ప్రకటించిన 16మంది పోగా.. మిగతా 24మంది వివరాలను శనివారం పోటీల ప్రారంభం ముందు ప్రకటిస్తారు. ఫ్యాషన్‌ షో, ఇతర పోటీల ఆధారంగా ఈ 40మంది నుంచి.. 20 మందిని ఎంపిక చేస్తారు. అంటే ఒక్కో విభాగం నుంచి సంఖ్య 5కు తగ్గుతుంది. తర్వాత ఒక్కో విభా గం నుంచి ఇద్దరు చొప్పున 8మందిని తుది పోటీకి ఎంపిక చేస్తారు. జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా.. ఒక్కో విభాగం నుంచి ఒకరు ఎంపికవుతారు. వీరిలో ఒకరు ప్రపంచ సుందరిగా, మిగతా ముగ్గురు రన్నర్‌పలుగా నిలుస్తారు. గత మిస్‌వరల్డ్‌ విజేత చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టినా ఈసారి విజేతకు వజ్రాల కిరీటం పెడతారు.


నలుగురు న్యాయనిర్ణేతలు..

తుది పోటీలకు నలుగురు న్యాయనిర్ణేతల పేర్లను నిర్వహక సంస్థ శుక్రవారం ప్రకటించింది. వీరిలో నటుడు సోనూ సూద్‌, మేఘా ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ సుధారెడ్డి, మిస్‌ ఇంగ్లండ్‌-2014 విజేత కెరీనా టురెల్‌, మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌పర్సన్‌ జూలియా మోర్లీ ఉన్నారు. విజేత పేరును జూలియా మోర్లీ ప్రకటిస్తారు. తుదిపోటీలకు మిస్‌ వరల్డ్‌-2016 విజేత స్టిఫానీ డెల్‌వ్యాలీ, సచిన్‌ కుంభర్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్‌ నటులు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ఇషాన్‌ ఖట్టర్‌ తమ నృత్యంతో అలరించనున్నారు. తుది పోటీలు సాయంత్రం 5-30 గంటలకు ప్రారంభమై రాత్రి 9-30కు ముగుస్తాయి.

భారత్‌ గెలిస్తే రికార్డు..

ఈసారి పోటీల్లో భారత సుందరి నందిని గుప్తా గెలిస్తే.. ఎక్కువ సార్లు మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్న దేశంగా భారత్‌ రికార్డు సాధిస్తుంది. 1951 నుంచి ప్రపంచ సుందరి పోటీలు జరుగుతుండగా.. భారత్‌, వెనెజువెలా 6సార్లు చొప్పున కిరీటం గెలుచుకున్నాయి. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటం గెలిచారు. 1994లో ఐశ్వర్యారాయ్‌, 1997లో డయా నా హెడెన్‌, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాం కా చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ విజేతలుగా నిలిచారు. ఈసారి గెలిస్తే ఏడోసారి కిరీటం భారత్‌ సొంతమవుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన పోటీలో నందినీ గుప్తా.. ఏషియా-ఓషియానా విభాగంలో తుర్కియే, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా భామల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటివరకు యూకే 5 సార్లు, జమైకా 4, దక్షిణాఫ్రికా, యూఎ్‌సఏ, ఐస్‌లాండ్‌, స్వీడన్‌ 3సార్లు మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్నాయి.


అందరి చూపు.. హైదరాబాద్‌ వైపు..

ఈనెల 10న గచ్చిబౌలిలో జరిగిన మిస్‌ వరల్డ్‌ ప్రారంభ వేడుకలు 120కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారంకాగా.. శనివారం జరిగే తుది పోటీలు 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. భారత్‌లో సోనిలివ్‌ చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఠీఠీఠీ. ఠ్చ్టీఛిజిఝజీటటఠీౌటజూఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ ద్వారా వీక్షించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది మిస్‌ వరల్డ్‌ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తారని అంచనా. తుది పోటీల కోసం హైటెక్స్‌లో 4వేల మందికి సరిప డా ఏర్పాట్లుచేశారు. సీఎం, మంత్రులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు


వెళ్లాయి. మిస్‌ వరల్డ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సుధారెడ్డి

మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ సుధారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె మిస్‌ వరల్డ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ చైర్‌ పర్సన్‌ జూలియా మోర్లీ శుక్రవారం ప్రకటించారు. మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న 108మంది అందాల భామలకు సుధారెడ్డి తన నివాసంలో ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ గాలా’విందు ఇచ్చారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారత కోసం సుధారెడ్డి తన పేరిట ఓ ఫౌండేషన్‌ స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా సామాజిక సేవలో నిమగ్నమైన సుధారెడ్డిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం సంతోషంగా ఉందని జూలియా మోర్లీ ప్రకటించారు. ఈనియామకం తన సేవాబాధ్యతను పెంచిందని సుధారెడ్డి అన్నారు.

మిస్‌ వరల్డ్‌ పోటీలు, కార్యక్రమాలు ఇలా..

మే-3 నుంచి 8 వరకు వివిధ దేశాల ప్రతినిధుల ఆగమనం. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో వారికి తెలంగాణ సంప్రదాయ రీతిలో ఆహ్వానం

మే-10: గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభోత్సవం. 108దేశాల అభ్యర్థుల పరిచయం

మే-12: నాగార్జునసాగర్‌ బుద్దవనం సందర్శన

మే-13: చార్మినార్‌ సందర్శన, హెరిటేజ్‌ వాక్‌, లాడ్‌ బజార్‌ షాపింగ్‌, చౌమోహల్లా ప్యాలెస్‌లోవిందు

మే-14: వరంగల్‌ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప సందర్శన

మే-15: యాదగిరిగుట్టలో దర్శనం, చేనేత గ్రామం పోచంపల్లి సందర్శన

మే-16: హెల్త్‌ టూరిజంలో భాగంగా ఏఐజీ ఆసుపత్రి సందర్శన, పిల్లలమర్రి, ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ సందర్శన

మే-17: గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్‌ ఫినాలే. రామోజీ ఫిల్మ్‌ సిటీ పర్యటన

మే-18: భద్రతపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సచివాలయం సందర్శన

మే-21: శిల్పారామం, విక్టోరియా హోమ్‌ సందర్శన

మే-22: శిల్పకళా వేదికలో టాలెంట్‌ ఫినాలే

మే-23: టి-హబ్‌లో హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌ ఫైనల్‌

మే-24: మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్‌, ఫ్యాషన్‌ షో పోటీ

మే-26: బ్యూటీ విత్‌ పర్పస్‌, గాలా డిన్నర్‌

మే-27 నుంచి 30: ఫైనల్స్‌ కోసం రిహార్సల్స్‌

మే-31: మిస్‌ వరల్డ్‌ 2025 ఎంపిక

జూన్‌-2: రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 06:59 AM