Hyderabad: అందగత్తెలు వచ్చేస్తున్నారు..
ABN , Publish Date - May 04 , 2025 | 04:13 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు.

శంషాబాద్ ఎయిర్పోర్టులో మిస్ కెనడా మోరిసన్కు సంప్రదాయ స్వాగతం
నేడు, రేపు 120 దేశాల పోటీదార్ల రాక
మిస్వరల్డ్ వేదికగా మెడికల్ టూరిజంపై ప్రచారం.. 16న ‘ఏఐజీ’లో కార్యక్రమం
మిస్ కెనడా ఎమా డీనా కాథరిన్ మోరిసన్కు కళాకారిణుల స్వాగతం
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. కెనడా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మిస్ కెనడా కాఽ్యథరన్ మోరిసన్కు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా.. తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుటన బొట్టుపెట్టి, మెడలో పూలమాల వేసి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆమెను ఆతిథ్యం ఇచ్చే హోటల్కు తీసుకువెళ్లారు. ఇప్పటికే మిస్వరల్డ్ సంస్థ సీఈవో, చైర్సర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్వరల్డ్ ప్రతినిధి మిస్ కెర్రి హైదరాబాద్ చేరుకోగా.. ఆది, సోమవారాల్లో 120 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధులు రానున్నారు.
గ్లోబల్ మెడికల్ హబ్గా తెలంగాణ
ప్రపంచ స్థాయి సదుపాయాలు, సాంకేతికత, నిపుణులైన వైద్యులు, ఉన్నత ప్రమాణాలతో వైద్య చికిత్సలను అందిస్తూ గుర్తింపు పొందిన తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకాల మేరకు త్వరలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల వేదికగా ఈ విషయాన్ని చాటిచెప్పేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా 150పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేదిక ద్వారా మెడికల్ టూరిజంపై ప్రచారం చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ టూరిస్టులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 16వ తేదీన తెలంగాణ మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగా ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్య ేసవలు, మెడికల్ టూరిజంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తెలియజేసేలా హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో మెడికల్ టూరిజం ఈవెంట్ను నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.
సీఎస్ సమీక్ష
మిస్వరల్డ్ 2025 పోటీదారులు, ప్రతినిధులకు శంషాబాద్ విమానాశ్రయంతోపాటు హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే పోటీదారులు, అతిథులు, ప్రతినిధుల కోసం సమగ్ర సమాచార బుక్లెట్లను సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. వారు సందర్శించే ప్రదేశాలను యుద్ద ప్రాతిపాదికన సుందరీకరించాలని ఆదేశించారు.
హెరిటేజ్ వాక్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
చార్మినార్: మదీనా, పత్తర్గట్టి, గుల్జర్ హౌస్, చార్మినార్, లాడ్ బజార్ గాజుల మార్కెట్ నుంచి చౌమొహల్లా ప్యాలెస్ వరకు మిస్ వరల్డ్ పోటీదారులు ఈనెల 13న హెరిటేజ్ వాక్ నిర్వహంచనున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాట్లను పరిశీలించారు. చౌమోహల్లా ప్యాలె్సలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చార్మినార్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరిత మాట్లాడుతూ మదీనా నుంచి చార్మినార్ వరకు గాజుల షాపులను అందంగా తీర్చిదిద్దాలని వ్యాపారులకు సూచించామని, ఆయా మార్గాల్లో రోడ్లు, వీధి దీపాలు ఆధునికీకరిస్తున్నామని, ఎక్కడా చెత్త కనబడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..