Minister Jupally Krishna Rao: తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం
ABN , Publish Date - May 07 , 2025 | 03:43 AM
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికీ ఊతం
ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక.. మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి
అతిథులకు ఘన స్వాగతం పలకాలి: మంత్రి జూపల్లి.. నేడు 70 దేశాల సుందరీమణుల రాక
హైదరాబాద్/సిటీ/శంషాబాద్ రూరల్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణలో నిర్వహించడం మనకు గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక మూలాలు, మనం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశాన్ని ఈ పోటీలు కల్పిస్తాయని అన్నారు. ఈ పోటీల కోసం ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేశామని జూపల్లి తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు, ఇతర అంశాలను వివరించేందుకు మంగళవారమిక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి జూపల్లితో పాటు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైౖర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, నటుడు సోనూసూద్, మిస్ ఇండియా నందినీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రపంచ సుందరి పోటీలకు ఎవరైనా హాజరు కావచ్చని చెప్పారు. పోటీలకు వచ్చే ప్రతినిధులందరూ ప్రపంచ శ్రేణి అనుభవాలను పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ అనేది కేవలం అందాన్ని, ప్రతిభను చాటుకొనే పోటీ మాత్రమే కాదని.. ఇది సాధికారత, వైవిధ్యం, ప్రపంచ ఐక్యతకు వేదిక అని పేర్కొన్నారు. ఈ పోటీల వల్ల తెలంగాణ గురించి యావత్ ప్రపంచం తెలుసుకుంటుందని, రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చూపటానికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ పోటీపడ్డాయని, సీఎం రేవంత్ చొరవతో ఈ పోటీల నిర్వహణ అవకాశం రాష్ట్రానికి దక్కిందని తెలిపారు. ఈ పోటీల ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
ఈ పోటీలు మన మహిళలకు స్ఫూర్తి కలిగిస్తాయని జూపల్లి చెప్పారు. ప్రతి దేశం తమ ప్రతినిధిని పంపడం మాత్రమే కాదు, తెలంగాణను దగ్గరగా చూస్తుందని మిస్ వరల్డ్ సీఈవో జూలియా తెలిపారు. ప్రతి ఒక్కరికీ పర్యాటకం కావాల్సిందేనని, ప్రపంచంలో పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. తమకు సాదరంగా ఆహ్వానించారని.. తెలంగాణకు అత్యుత్తమమైంది కావాలని, అది తాము ఇస్తామని అన్నారు. ఈ పోటీలకు 120కి పైగా దేశాల నుంచి అందగత్తెలు రానున్నారన్నారు. ఈ పోటీల ద్వారా భారతదేశం నుంచి ప్రపంచం నేర్చుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలకు ఒక నేపథ్యం ఉంటుందని.. ఈ సారి పర్యాటకంపై దృష్టి సారించామని జూలియా వివరించారు. సినీ నటుడు సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, వారి ప్రేమ అపూర్వమని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు చూస్తూ ఎదిగిన తాను.. ఈ రోజు ఆ పోటీల నిర్వాహకులతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తన జీవితంలో అత్యంత అందమైన మహిళ తన భార్యేనన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుండడం ఆనందంగా ఉన్నప్నటికీ ఒత్తిడి కూడా అధికంగానే ఉందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ చూడొచ్చు..
భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నప్పటికీ, విదేశీయులకు కొన్ని ప్రాంతాలు మాత్రమే తెలుసని జయేశ్ రంజన్ అన్నారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణలో కూడా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఎవరైనా హాజరు కావొచ్చన్నారు. కేవలం ప్రముఖులకు మాత్రమే అన్నది అపోహ అని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. పొరుగు దేశాలతో ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ.. అవి కాస్త ఆందోళన కలిగించేవే అయినప్పటికీ, మన పోలీసులు దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తారని జయేశ్ చెప్పారు.
మన సంస్కృతి ప్రతిబింబించాలి: జూపల్లి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు విమానాశ్రయంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏర్పాట్లను పరిశీలించారు. అతిఽఽథులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని జీఎంఆర్, పర్యాటక శాఖ అధికారులకు స్పష్టం చేశారు. విమానాశ్రయాన్ని పూలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరించాలని చెప్పారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్ త్వరగా పూర్తి చేయాలని సీఐఎ్సఎఫ్ అధికారులకు సూచించారు. అడుగడుగునా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా చూడాలని తెలిపారు. అదే సమయంలో ఎయిర్పోర్టుకు చేరుకున్న మిస్ ఇండియా నందినీ గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్తో జూపల్లి సమావేశమయ్యారు. తెలంగాణలోని వారసత్వ, చారిత్రక కట్టడాలను సందర్శించాలని వారిని కోరారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లపై మంత్రి జూపల్లి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సమయం దగ్గర పడుతున్నా.. అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం పట్ల భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాగత తోరణాలను కార్డు బోర్డులతో కాకుండా మామిడి, అరటి ఆకులు, పూలతో ఘనంగా తీర్చిదిద్దాలని సూచించారు. షోబోట్ ఈవెంట్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పాట్లు చేయొద్దన్నారు. ఏర్పాట్లలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
నా హృదయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం: నందిని
‘అందరికీ నమస్కారం. నేను మీ నందినీ గుప్తా. మీరందరూ ఎలా ఉన్నారు?’ అంటూ మిస్ వరల్డ్ ఇండియా నందినీ గుప్తా తెలుగులో అందరినీ పలకరించారు. ఈ పోటీలకు తాను ఇప్పటికే సన్నద్ధమయ్యానని, దాన్ని ప్రదర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. తనపై తనకు నమ్మకం ఉందన్నారు. తన హృదయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్.. చారిత్రక వైభవం, ఆధునిక అద్భుతం కలగలిసిన నగరమని చెప్పారు. నగరంలో అన్నీ అద్భుతమేనని కొనియాడారు. తెలంగాణలోని ప్రతి ఒక్క అంశాన్నీ గొప్పగా చెప్పిన నందిని.. తెలంగాణకు తప్పకుండా రావాలని అందరికీ పిలుపునిచ్చారు.
పర్యాటక ప్రాంతాలు ముస్తాబు..
ప్రపంచ సుందరి పోటీలకు నగరంలోని పర్యాటక ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. అందాల భామలు, విదేశీ ప్రతినిధులను ఆకర్షించేందుకు ఆయా ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. చార్మినార్ చుట్టూ ఉన్న చిరు వ్యాపారులను దూరంగా పంపించి, అక్కడి ప్రదేశాలను శుభ్రపరుస్తున్నారు. కాగా, వివిధ దేశాల నుంచి వచ్చే అందగత్తెలు బస చేసే, సందర్శించే ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తుతో పాటు 163 సెక్షన్ (గతంలో 144) అమల్లో ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కాగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల అందగత్తెలు బుధవారం హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోటీల భద్రతపై కేంద్రం ఆరా
మిస్ వరల్డ్ పోటీలకు వస్తున్న అతిథులు, విదేశీ పాత్రికేయులు, పోటీదారుల భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు కేంద్ర నిఘా వర్గాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల భద్రతపై డీజీపీ జితేందర్ స్వయంగా రోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు.