Share News

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:19 AM

హైదరాబాద్‌, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

అంగీకరించిన మావోయిస్టులు.. ఫ్లెక్సిబుల్‌ యుద్ధానికి పిలుపు.. గత ఏడాది 357 మంది మృతి

  • ఈ నెలాఖరు నుంచి అమర వీరుల వారోత్సవాలు

  • మావోయిస్టుల నివేదికలో వెల్లడి

  • పోలీసు లెక్కల్లో 217 మరణాలే?

హైదరాబాద్‌, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది. ఈ మేరకు సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ జూన్‌ 23న 22 పేజీల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాది మొత్తం 357 మంది మావోయిస్టులు పోరాటంలో చనిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మే 20న ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నేపథ్యంలో.. ఇకపై అనుసరించాల్సిన కొత్త వ్యూహాలను ఈ నివేదికలో మావోయిస్టు నేతలు వివరించారు. 1967లో పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీలో మొదలైన నక్సలిజం ఉద్య మం.. ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలకు విస్తరించిన విషయం తెలిసిం దే..! ఇది దేశానికి అతిపెద్ద అంతర్గత భద్రత సమస్యగా కేంద్రం భావించింది. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్లతో గత ఏడాది 357 మంది నక్సలైట్లు మరణించినట్లు, వీరిలో 136 మంది మహిళలున్నట్లు మావోయిస్టు పార్టీ తాజా నివేదిక స్పష్టం చేసింది. నలుగురు మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో, ఒకరు ప్రమాదంలో చనిపోయారని పేర్కొంది. ‘‘357 మందిలో.. 80 మందిని నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మరో 269 మంది పోలీసు బలగాల ముట్టడిలో చనిపోయారు. వీరిలో బస్వరాజ్‌తో కలిపి.. నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర స్థాయి నాయకులు, 17 పీఎల్‌జీఏ సభ్యులు, ఆరుగురు ప్రజా విభాగానికి చెందినవారు, 34 మంది సాధారణ ప్రజలు ఉన్నారు. మరో 36 మందికి సంబంధించిన సమాచారం తెలియదు’’ అని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే.. పోలీసుల రికార్డులు మాత్రం గత ఏడాది 217 మంది మావోయిస్టులు చనిపోయినట్లు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థానికి ఆ సంఖ్య 460కి చేరినట్లు వివరిస్తున్నాయి.


వైఫల్యాలకు కారణాలు..

ప్రభుత్వాలు నక్సల్స్‌ ఆపరేషన్లకు 20వేల మంది జవాన్లను మోహరించగా.. తమ గెరిల్లా యుద్ధ నియమాలు, రహస్య విధానాలు సరిగ్గా అమలవ్వకపోవడంతో దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది. ‘‘ఒకచోట ఉండొద్దు.. గాలిలా విస్తరించాలి. నీటిలా ప్రవహించాలి.. శత్రువు శక్తిమంతంగా ఉన్నప్పుడు .. బలగాన్ని కాపాడుకుంటూ పోవాలి’’ అనే వ్యూహాన్ని విస్మరించడం వల్ల నష్టం జరిగినట్లు విశ్లేషించింది.

ఫ్లెక్సిబుల్‌ యుద్ధమే మార్గం?

తమ పోరు కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ తన తాజా నివేదికలో స్పష్టం చేయగా.. ఇకపై ఫ్లెక్సిబుల్‌ యుద్ధ పద్ధతులను అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంటే.. బలగాలతో నేరుగా తలపడకుండా.. వీలు చిక్కినప్పుడు గెరిల్లా పోరాటాలు, లేదంటే.. మందుపాతరలతో నష్టం కలిగించడం వంటి చర్యలు ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పీఎల్‌జీఏని బలోపేతం చేసి, పార్టీని రక్షించుకోవాలి. గత ఏడాది పీఎల్‌జీఏకి చెందిన 75 మంది చనిపోగా.. 130 మంది గాయపడ్డారు’ అని ఆ నివేదిక వివరిస్తోంది. అమరులను స్మరించుకుంటూ.. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ‘అమరవీరుల వారోత్సవాల’ను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.


పీఎల్‌జీఏ దాడుల్లో 75 మంది పోలీసుల మృతి

పీఎల్‌జీఏ దాడుల్లో 75 మంది పోలీసులు మృతిచెందారని నివేదిక స్పష్టం చేసింది. మరో 130 మంది పోలీసులు గాయపడ్డారని పేర్కొంది.

పోలీసులేమంటున్నారు?

ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్లు ఆ రాష్ట్ర అదనపు డీజీ(యాంటీ నక్సలిజం) వివేకానంద సిన్హా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘాతో వారిని కట్టడి చేయగలిగామన్నారు. ‘ప్రస్తుతం మావోయిస్టులు ప్రజలతో కలిసిపోయారు. అయితే.. ప్రజలను అనుమానం తో చూస్తుండడం వల్ల.. అమాయకుల హత్యలు పెరిగాయి. బస్తర్‌లో మావోయిస్టులు తమ యూ నిట్లను చిన్నచిన్నగా విభజించారు. కొందరు దట్టమైన అడవుల్లోకి వెళ్లగా.. మరికొందరు ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తులను వీడి, సాధారణ పౌరుల్లో కలిసిపోయా రు’ అని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితు ల్లో తిరుగుబాటు సరికాదని మావోయిస్టు పొలిట్‌బ్యూరో భావిస్తోందన్నారు. పౌరహక్కుల సంఘా ల ద్వారా ప్రభుత్వాలపై చర్చలకు ఒత్తిడి తేవాలని మావోయిస్టులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 05:19 AM