Employment Opportunities: 3న మలబార్ గోల్డ్ పరిశ్రమ ప్రారంభం
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:50 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మరో భారీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. రూ.700కోట్లతో కేసీ తండా పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ కర్మాగారం ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేవంత్ లేదా దుద్దిళ్లచేతులమీదుగా ఆవిష్కరణ
2వేల మందికి ఉపాధినిచ్చేలా కర్మాగారం
మహేశ్వరం, జూన్ 29 (ఆంద్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మరో భారీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. రూ.700కోట్లతో కేసీ తండా పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ కర్మాగారం ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని యాజమాన్యం యోచిస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పరిశ్రమలో 1,500 నుంచి 2 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమలో నూటికి 20% మంది మహిళలకు వారి విద్యార్హతలు, ఆభరణాల తయారీలో నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కాగా, తుక్కుగూడలోని ఈ-సిటీ, ఫ్యాబ్సిటీలో అనేక రకాల పరిశ్రమలు ఉండటంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేసీ తండా పరిసర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన ఎలకా్ట్రనిక్ సిటీలో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు.