Hyderabad: పోలీస్ శాఖపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. త్వరలో ఐపీఎస్ల బదిలీలు..
ABN , Publish Date - Jun 14 , 2025 | 09:56 AM
భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

- అక్రమార్కుల ప్రక్షాళనకు రంగం సిద్దం
- ట్రై కమిషనరేట్స్ డీసీపీల్లో గుబులు
హైదరాబాద్ సిటీ: భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్(IPS)ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పోలీస్ శాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఉన్నత అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడు తున్న డీసీపీ స్థాయి అధికారులపై ఆరా తీసినట్లు సమాచారం. దాంతో డీసీపీలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. దీంతో ట్రై కమిషనరేట్స్ డీసీపీల్లో గుబులు మొదలైంది. బదిలీలు అనివార్యమని భావించిన కొందరు డీసీపీలు ప్రాధాన్యం కలిగిన పోస్టింగ్లు దక్కించుకునేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పెరిగిపోయిన అవినీతి, అక్రమాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మొట్టమొదట పోలీస్ శాఖపైనే దృష్టి సారించింది. ట్రై కమిషనరేట్ సీపీలను, డీసీపీలు, ఏసీపీలను మార్చింది. లాబీయింగ్ చేసుకున్న కొంతమంది డీసీపీలు, ఏసీపీలు ఫోకల్ పోస్టింగ్లు పొందారు. వారిలో కొందరు డీసీపీలు, ఏసీపీలు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. దాంతో పలు జోన్లు, డివిజన్లలో అవినీతి పెచ్చుమీరిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కేసులు పక్కన పడేసి కాసుల కోసం అర్రులు చాస్తున్నట్లు, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్ చేసి రూ. లక్షలు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఉన్నతాధికారులు ఇటీవల భారీస్థాయిలో ఏసీపీ (డీఎస్పీ)లను బదిలీ చేశారు. ఇప్పుడు డీసీపీల ప్రక్షాళనకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వసూళ్లలో ‘స్పెషల్’ డీసీపీ
ఖరీదైన కమిషనరేట్లో స్పెషల్ పోలీస్ డీసీపీగా పనిచేస్తున్న ఒక అధికారి వసూళ్లలో స్పెషల్ అనిపించుకుంటున్నారు. వసూళ్ల కోసం ఆయన ఏకంగా క్షేత్రస్థాయిలో ఇద్దరు పోలీసులను నియమించుకున్నట్లు సమాచారం. వసూళ్లకు పాల్పడుతున్న క్రమంలో వారు ఇతర పోలీసులకు చిక్కి కేసుల పాలయ్యారు. ఆ తర్వాత డీసీపీ వారిని దూరం పెట్టి జైలు నుంచి బయటకు తెచ్చేందుకు పరోక్షంగా సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అక్రమాల హవా
శివారులో ఉన్న ఓ ఖరీదైన కమిషనరేట్లో డీసీపీల హవా కొనసాగుతున్నట్లు డిపారుమెంట్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఖరీదైన కమిషనరేట్ బాస్గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్, పాలనలో సింహభాగం డీసీపీల చేతుల్లోనే పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో వారి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖరీదైన కమిషనరేట్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, అనవసర విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సీపీ అబాసుపాలైనట్లు డిపార్టుమెంట్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కొందరు డీసీపీలైతే ఏసీపీలను పక్కకు నెట్టి మరీ అక్రమార్కులతో చేతులు కలిపి, ఇన్స్పెక్టర్ల సహకారం తో అడ్డగోలు దందాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అలా సం పాదించిన డబ్బుతో విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ఇటీవల ఒక డీసీపీ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నేడో రేపో జరగబోయే ఐపీఎ్సల బదిలీల్లో ఉన్నతాధికారులు ఏ మేరకు ప్రక్షాళన చేస్తారో వేచి చూడాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News