Crime News: తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అరెస్టు
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:28 PM
Crime News: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు.

Jogulamba Gadwal: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసు (Tejeshwar Tragedy Case)ను జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal Dist) పోలీసులు (Police) ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఐశ్వర్య(Aishwarya), ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి సుఫారీ గ్యాంగ్ (Sufari Gang)తో తేజేశ్వర్ను హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ టి.శ్రీనివాస్ రావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి కారు, 2 కొడవళ్లు, కత్తి, రూ.1.20లక్షలు, 10 మొబైల్ పోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
తేజేశ్వర్ బైక్లో జీపీఎస్ పరికరం అమరిక..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు. మే 17వ తేదీన బీచుపల్లి దేవస్థానంలో తేజేశ్వర్, ఐశ్వర్యల వివాహం జరిగిందని, వారు కొన్ని రోజులపాటు కర్నూల్లోనే కాపురం పెట్టారన్నారు. ఆ క్రమంలో ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో సన్నిహితంగా ఉండటం చూసిన తేజేశ్వర్.. అనుమానం వచ్చి భార్య ఐశ్వర్యను గద్వాలకు తీసుకువచ్చాడన్నారు. దీంతో తేజేశ్వర్ అడ్డు తొలగించుకోవాలని ఐశ్వర్య తిరుమలరావు నిర్ణయించారని, ఆ మేరకు తేజేశ్వర్ బైక్లో జీపీఎస్ పరికరం అమర్చారన్నారు.
నాలుగైదు సార్లు హత్యాయత్నం చేసినా.. విఫలం..
తేజేశ్వర్ను హత్య చేసేందుకు నాలుగైదు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో జూన్ 17న మాయమాటలు చెప్పి తేజేశ్వర్ను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. కారులోనే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాల జిల్లా పాణ్యం వద్ద పడేశారన్నారు. సెల్ ఫోన్ కాల్స్.. కారు ట్రాకింగ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారని ఎస్పీ వెల్లడించారు.
కడపలో తిరుమలరావు అరెస్టు..
హత్య అనంతరం బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు హైదరాబాద్ పారిపోయాడని, అక్కడి నుంచి తన స్నేహితుడు అశోక్ స్వగ్రామం కడప జిల్లా పొద్దుటూరుకు మకాం మార్చాడని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు అశోక్ ద్వారా తిరుమలరావు ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారన్నారు. తేజేశ్వర్ హత్య తర్వాత మిస్సింగ్ కేసుగానే ఉంటుందని భావించిన తిరుమలరావు.. ఐశ్వర్యతో కలిసి లద్దాక్ వెళ్లి అక్కడే కొన్నాళ్లు ఉండాలనుకున్నాడని పేర్కొన్నారు. అనంతరం వీలైతే విదేశాలకు వెళ్లాలని రూ.20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడని ఎస్పీ వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News