K Kavitha: బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:30 AM
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్ర అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో ప్రణాళిక రూపొందించి అమలుకు కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మల్యాల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్ర అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో ప్రణాళిక రూపొందించి అమలుకు కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం మారినందున అభివృద్ధి ఆగిపోకుండా గత ప్రణాళిక అమలు చేయాలని కోరారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా కొండగట్టు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.
తమ ప్రభుత్వం కొండగట్టు మెట్లదారి, కోనేరు, షెడ్లు, దీక్ష విరమణ మండపం పనులు చేపట్టిందన్నారు. కొండగట్టు ఘాట్రోడ్డు అభివృద్ధి పనులపై ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను వచ్చే హనుమాన్ జయంతిలోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కవిత వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు.