Share News

Kishan Reddy: ఏది పడితే అది మాట్లాడితే ఎలా!

ABN , Publish Date - May 29 , 2025 | 03:35 AM

ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy: ఏది పడితే అది మాట్లాడితే ఎలా!

  • ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు

  • మీ సొంత అజెండాను పార్టీ అజెండాగా రుద్దొద్దు

  • జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా?

  • ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్‌కు తగినట్టే మాట్లాడాలి

  • ఎంపీ రఘునందన్‌ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి క్లాస్‌

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప, సొంత అజెండాలు పనిచేయబోవని.. ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్‌రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక అంశంపై ఇద్దరు, ముగ్గురు నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్‌ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్‌లో చేరుతారంటూ కొందరు నేతలు మాట్లాడారు.


దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు వెళ్లినట్టు తెలిసింది. ‘అసలు పార్టీ లైన్‌ ఏమిటో తెలియక తర్జనభర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్‌లోనే మాట్లాడితే బాగుంటుంది..’ అని వారునివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు కిషన్‌రెడ్డి.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారికి క్లాస్‌ తీసుకున్నట్టు సమాచారం. ‘‘ఒక అంశంపై ఒకాయన మాట్లాడితే, దానిని ఖండిస్తున్నట్టుగా మరో నేత చెబుతారు. ఇదేం పద్ధతి? కొన్నిరోజులుగా రాష్ట్ర పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు రాసిన లేఖపై కొందరు నేతలు ఏవేవో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలోనూ పార్టీకి, ఎంపీ ఈటలకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. ఇదెక్కడి పద్ధతి?’’ అని కిషన్‌రెడ్డి నిలదీసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలో ఉన్న సంగతి కూడా మరిచిపోయి మీడియా ఎదుట ఏదేదో మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారని వెల్లడించాయి. ఇలాంటి వ్యాఖ్యలతో ముఖ్యనేతలకు ఇబ్బంది కలుగుతోందని స్పష్టం చేశారని, వివరణ ఇచ్చుకోవాల్సి రావడం తమకు తలనొప్పిగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారని పేర్కొన్నాయి.


రాష్ట్రంలో స.హ.చట్టం పనిచేస్తోందా?: రాణిరుద్రమ

సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకూడదనే నిబంధన ఏదైనా ఉందేమోనని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ అనుమానం వ్యక్తం చేశారు. దానిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పని చేస్తోందా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనవరి 31న ఆర్థికశాఖ వివరాల కోసం 27 ప్రశ్నలతో బీజేపీ తరఫున దరఖాస్తు చేస్తే ఆర్టీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దాంతో మార్చి 12న అప్పీలుకు వెళ్లినా.. నేటి వరకు ఎటువంటి సమాధానం రాలేదని తెలిపారు.

Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 03:01 PM