Share News

Kishan Reddy: బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి

ABN , Publish Date - May 31 , 2025 | 04:30 AM

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కవిత డాడీ కేసీఆరే సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ల డాడీనే ప్రశ్నించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి

  • కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏమిటి?

  • వాళ్లది ఆస్తులు, అధికారం, పదవుల కొట్లాట

  • డాడీ-డాటర్‌.. సిస్టర్‌-బ్రదర్‌.. ఫ్యామిలీ డ్రామా

  • అందులో మేం పాత్రధారులం కాబోము

  • ‘సిందూర్‌’పై బడేమియా రాహుల్‌ మాటలకు ఛోటేమియా రేవంత్‌ వత్తాసు: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కవిత డాడీ కేసీఆరే సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ల డాడీనే ప్రశ్నించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం గురించి కవిత చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పనికిరాని విషయాలపై తాను స్పందించబోనని.. ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్లకు ఉన్న విలువ ఏంటని ప్రశ్నించారు. కవిత చేసిన ఆరోపణలు నేను విని జవాబు చెప్పాలా..? అని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఓ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అని, అందులోని డైరెక్టర్ల మధ్య ఆస్తులు, అధికారం, పదవుల కోట్లాటపై తాము ఎందుకు తలదూర్చాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వాళ్లది ఇంటి సమస్య అని, చాలా చిన్న అంశమని అన్నారు. కవిత వ్యవహారంపై బీజేపీ సహా ఏ రాజకీయ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. అది డాడీ- డాటర్‌, సిస్టర్‌-బ్రదర్‌ డ్రామా అని.. వాళ్ల ఫ్యామిలీ డ్రామాలో తాము సూత్రధారులం, పాత్రధారులం కాబోమని చెప్పారు. ఆ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేని విషయమని అన్నారు.


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆయన బావ రాబర్ట్‌వాద్రా, సీఎం రేవంత్‌రెడ్డి దేశ సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని, పోరాటాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో, పాకిస్తాన్‌పై మన సైనికులు ఎలా విరుచుకుపడ్డారో అడిగి ఉంటే దేశ ప్రజలు, సైనికులు సంతోషపడేవారని.. ఇవేమీ అడగకుండా ఎన్ని రాఫెల్‌ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి..? అని రాహుల్‌ అడగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తాము దాడులు జరపాలని నిర్ణయించిన తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్‌ సాయుధ దళాలు దాడులు జరిపాయని, పాకిస్థాన్‌ ప్రధాని ఒప్పుకున్నప్పటికీ, మన దేశ సైనిక సత్తాపై రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో బడేమియా రాహుల్‌ మాటలకు.. అక్కడ హైదరాబాద్‌లో ఛోటేమియా రేవంత్‌ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్‌ సిందూర్‌పై సీఎం రేవంత్‌ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి విమర్శలు పాకిస్థాన్‌ ఆరోపణలకు మద్దతు ఇచ్చేలా ఉన్నాయన్నారు. యుద్ధంలో రాఫెల్‌ విమానాలను కోల్పోయామని చేసిన వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీపై ఉన్న అక్కసును సైన్యంపై వెళ్లగక్కారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. దేశ భద్రతపై కాంగ్రెస్‌ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ పాటించారని, భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ వద్ద తాకట్టు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారని పేర్కొన్నారు.


బీఆర్‌ఎస్‌ చెల్లని రూపాయి: రఘునందన్‌రావు

కేసీఆర్‌ కుటుంబం ప్రజల దృష్టిలో చెల్లని రూపాయిలా మారిపోయిందని, ఆ రూపాయికి బ్రాండింగ్‌ వేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. ఆస్తులు, కుటుంబం, పార్టీ పంచాయితీ, ఉంటే వారే తేల్చుకోవాలి తప్ప బీజేపీనీ వివాదంలోకి లాగొద్దని కవితకు విజ్ఞప్తి చేశారు. కవిత కొత్త పార్టీ పెడతారన్నది తనకున్న సమాచారం అని పునరుద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 04:30 AM