Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
ABN , Publish Date - May 03 , 2025 | 04:59 AM
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఓల్డ్ సిటీకి కూడా మిగతా ప్రాంతాలతో పాటుగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

కొన్ని చోట్ల మౌలిక వసతులూ లేవు
కేంద్రం నిధులను వినియోగించండి
మెట్రో ప్రతిపాదనలు పంపిస్తే సహకరిస్తా
అధికారులతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఓల్డ్ సిటీకి కూడా మిగతా ప్రాంతాలతో పాటుగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. కేంద్ర నిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్పేట, సనత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కూడా కీలకమని అన్నారు. మౌలిక వసతుల కొరత, ప్రాథమిక సౌకర్యాల సమస్యలతో ఓల్డ్ సిటీ ప్రాంతాలు కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణ, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ కేవలం కొన్ని ప్రాంతాలకే కాకుండా వెనుకబడిన ప్రాంతాలకు కూడా కేటాయిస్తూ నగరాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రతి డివిజన్కు సంబంధించిన అవసరాలను గుర్తించి కేంద్రానికి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. కేంద్ర నిధులను సమర్థంగా ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు అఫ్జల్గంజ్ వరకే పరిమితమైందని, రానున్న రోజుల్లో విడతల వారీగా ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తే అవసరమైన నిధులు, రుణాలు లభించేలా సహకరిస్తానని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు.
మదర్సాల్లో ఉగ్ర శిక్షణ?: రఘునందన్
దేవాదాయ భూముల్లో మదర్సాలు ఎలా నిర్మిస్తారని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిన్నారం మదర్సాలో ఉన్న 70 మంది విద్యార్థులలో 65 మంది బిహార్లోని కిషన్గంజ్ నుంచి వచ్చినట్లు తెలిసిందన్నారు. మదర్సాలలో చదువు చెప్పే వారు భారతీయులే కాదని స్థానికులు అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను తీసుకువచ్చి మదర్సాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్షణ ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అనుమతులున్న మదర్సాల వివరాలు, వాటిలో చదువుతున్న విద్యార్థులు, బోధకుల వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు. సదాశివపేటలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులకు ఓటరు, ఆధార్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇస్నాపూర్ వద్ద 247మంది నేపాల్ దేశస్థులకు ఆధార్కార్డులు మంజూరు చేశారని, ఇది దేశ భద్రతకు ముప్పేనని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News