Share News

Kishan Reddy: కాంగ్రెస్‌, పాక్‌లది అక్రమ స్నేహబంధం

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:34 AM

కాంగ్రెస్‌, పాకిస్థాన్‌లది అక్రమ స్నేహబంధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్‌ మంత్రులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

Kishan Reddy: కాంగ్రెస్‌, పాక్‌లది అక్రమ స్నేహబంధం

  • ఆలోచనా సరళి ఇద్దరిదీ ఒకటే ..

  • కాంగ్రెస్‌ చెప్పినట్టు పాక్‌ నడుస్తోందా?

  • పాక్‌ చెప్పినట్టు కాంగ్రెస్‌ చేస్తోందా?

  • ఉగ్ర భాషలో కాంగ్రెస్‌ మాట్లాడుతోంది

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, పాకిస్థాన్‌లది అక్రమ స్నేహబంధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్‌ మంత్రులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ నేతల ట్వీట్లను పాకిస్థాన్‌ రీట్వీట్‌ చేస్తోందని.. వారిరువురి మధ్య ఉన్న అక్రమ స్నేహబంధానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకుండా.. బిహార్‌లో ఓ సభలో పాల్గొనటంపై కాంగ్రెస్‌ తాజాగా ఓ ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేసింది. మోదీ పోలికలున్న ఓ వ్యక్తి ఫొటోను తల లేకుండా షేర్‌ చేస్తూ.. ‘బాధ్యతగా ఉండాల్సిన సమయంలో అదృశ్యం’ (గాయబ్‌) అనే వ్యాఖ్యను జోడించింది.


దీనిపై కిషన్‌రెడ్డి తాజాగా స్పందిస్తూ.. యావత్‌ భారతం, ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నినదిస్తున్నాయని, కాంగ్రెస్‌ మాత్రం బాధ్యతను మరిచి ప్రధానిని కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తోందని మండిపడ్డారు. దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్‌.. పాకిస్థాన్‌, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలోనే మాట్లాడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, పాకిస్థాన్‌ వ్యవహార శైలి, ఆలోచనా విధానం ఒకటేనన్నారు. కొంతకాలం క్రితం పాకిస్థాన్‌ అనుకూల ఉగ్రవాదులు.. మహాశివుని చిత్రంలో శిరస్సు స్థానంలో వారి జెండాను ఎగరవేసిన చిత్రాన్ని విడుదల చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌ సైతం అదే తరహాలో మోదీ ఫొటోలో తలను తొలగించి గాయబ్‌ అంటూ పోస్టు పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్‌ చెప్పినట్టు పాకిస్థాన్‌ నడుస్తోందా? పాకిస్థాన్‌ చెప్పినట్టు కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందా? అనే సందేహం దేశ ప్రజల్లో కలుగుతోందని అన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ తదితరులు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు.


కశ్మీర్‌లో శాంతి కంటగింపుగా మారింది

హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో దేశంలో అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు, మతకల్లోహాలు, ఉగ్రవాద ఘటనలు జరిగేవని విమర్శించారు. 2019లో ఆర్టికల్‌ 370ని తొలగించిన తర్వాత జమ్ముకశ్మీర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఇది పాకిస్థాన్‌కు, దేశంలోని కొన్ని అంతర్గత శక్తులకు కంటగింపుగా మారిందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:35 AM