Hyderabad: స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత!
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:33 AM
రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

భూ భారతి చట్టంలో పలు సవరణలు
రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఫీజు వసూలు,
సాదాబైనామా అంశాలపై మంత్రివర్గంలో చర్చ
ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం
హ్యామ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పులు
కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులపైనా..
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం.. స్థానిక ఎన్నికలు జూలైలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. క్యాబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు, వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపైనా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగుల డీఏలు, ఆర్థికేతర అంశాల పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో పలు సవరణలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తంగా క్యాబినెట్ భేటీలో కీలక అంశాలు ఎజెండాగా ఉండనున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రిమండలి కీలక చర్చ జరపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గ్రామపంచాయతీలతోపాటు ఆ తరువాత వరుసగా మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, కొన్ని మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటిలో సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరికే ముగియగా.. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. సర్పంచ్లు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.1,600 కోట్ల వరకు నిలిచిపోయాయి.
బీసీల రిజర్వేషన్ల అంశంపై..
రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వే వివరాలు వచ్చిన తరువాత స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉపాధి అవకాశాల్లోనూ 42 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి.. ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే ఈ బిల్లులు అమల్లోకి రావాలంటే పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. వాటిని అఽధిగమించాలంటే కేంద్రం పార్లమెంటులో ఆమోదించాల్సి ఉంది. ఆ తరువాత వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. వీటిపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాజకీయపరంగా ఇస్తామన్న రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికలు వెళ్దామా? లేదా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా? అన్న అంశంపై చర్చించనున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని 215 పంచాయతీలను 38 మునిసిపాలిటీల్లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిపైనా చర్చించనున్నారు. ధరణి స్థానంలో ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతిలో పలు కీలక సవరణలకు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్ కోసం చేసుకునే స్లాట్ బుకింగ్లకు వసూలు చేసే ఫీజుల అంశం ఉండొచ్చని తెలిసింది. ఉదాహరణకు.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ లాంటి జిల్లాల్లోని మారుమూల పట్టణాలు, గ్రామాలతోపాటు ఆదివాసీ, గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కానీ, ప్రస్తుత భూ భారతిలో అన్ని ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్ కోసం చేసుకునే స్లాట్ బుకింగ్ ఫీజులను ఒకేలా వసూలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకే ఫీజు కాకుండా భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. స్లాట్ బుకింగ్ ఫీజు వసూలు చేసే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. మరోవైపు సాదాబైనామాల క్రమబద్దీకరణ అంశంపైనా మంత్రిమండలిలో చర్చించనున్నారు. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపైనా ప్రభుత్వం చర్చింనుంది.
ప్యాకేజీలుగా హ్యామ్ రోడ్లు..
రాష్ట్రంలో 30 వేల కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్అండ్బీ పరిఽధిలో 13 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17 వేల కిలోమీటర్లను గుర్తించింది. ఈ రోడ్లను వచ్చే ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయాలని, 15 ఏళ్ల నిర్వహణకు కాంట్రాక్టు ఇవ్వాలని భావించింది. ప్రస్తుతం ఆర్అండ్బీ పరిధిలో మొదటి దశలో 5,190 కిలోమీటర్ల రోడ్లను హ్యామ్ కింద అభివృద్ధి చేయాలని గుర్తించారు. పంచాయతీరాజ్లోనూ కొంతమేర గుర్తించారు. అయితే వీటిని ప్యాకేజీలుగా మార్చాలని, వాటి ప్రకారమే పనులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశలో అభివృద్ధి చేయాలని అర్అండ్బీ అధికారులు గుర్తించిన మొత్తం కిలోమీటర్లను 40-50 ప్యాకేజీలుగా విభజించాలని ఇప్పటికే సూచించినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైనా చర్చించనున్నారు. పల్లెల్లో నిర్మించే ఇండ్లలో అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు విషయంలో లబ్ధిదారులు కొంత అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో తమ దృష్టికి వచ్చిందని పలువురు మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో అటాచ్డ్ బాత్రూమ్ను ఇంటిలోనే ఏర్పాటు చేసుకోకపోయినా ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించాలనే అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు ఇటీవల మంత్రులు జిల్లాల వారీగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించి రూపొందించిన నివేదికలపైనా క్యాబినెట్లో చర్చించి, ప్రధానమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులపైనా..
కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులు, ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. 17 మంది అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్, 33 మందిపై శాఖాపరమైన చర్యలు, ఏడుగురిపై సవరణ పెన్షన్ నిబంధనల ప్రకారం పెనాల్టీలు విధించాలని విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ ప్రభుత్వానికి సిఫారసుచేయడం తెలిసిందే.ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల్లో పరీక్షలు చేసే బాధ్యతను కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్ఎ్స)నకు ప్రభుత్వం కట్టబెట్టింది. అంతేకాకుండా బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు అందించాలని నిర్మాణ సంస్థలను కోరింది. దీనిపై ఎల్ అండ్ టీ ధిక్కార స్వరం వినిపించగా.. మిగిలిన సంస్థలు పునరుద్ధరణకు ముందుకువచ్చాయి. మేడిగడ్డలోని ఏడో బ్లాకు నిర్మాణం/పునరుద్ధరణకు అయ్యే ఖర్చునంతా ఎల్ అండ్ టీ నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. అంతేకాక ఈ సంస్థను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని సూచించింది. దాంతో విజిలెన్స్ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలా? లేక ప్రస్తుతం విచారణ జరుగుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలకు ఉపక్రమించాలా అనే దానిపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అంతే కాకుండా పలు ప్రాజెక్టుల సవరణ అంచనాలపైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి.
ఆవేదనను పరిష్కరిస్తాం.. ఆడబిడ్డను గౌరవిస్తాం
స్వాట్బృందాల ఏర్పాటుపై సీఎం ప్రశంసలు
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు.. కొత్తగా మహిళా పోలీసులతోనే స్వాట్ బృందాలను ఏర్పాటు చేయడాన్ని సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా బుధవారం ప్రశంసించారు. ‘స్వాట్ ఏర్పాటు అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిలో సరికొత్త ఆలోచన.. నిరసనను పరిగణిస్తాం.. నినాదాన్ని అలరిస్తాం.. ఆవేదనను పరిష్కరిస్తాం.. ఆడబిడ్డను గౌరవిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, నిరసన తెలుపుతున్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు.. 35 మంది మహిళా పోలీసులకు 45 రోజుల శిక్షణను ఇచ్చి స్వాట్ టీమ్స్ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవలే ప్రారంభించారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి