MLC Kavitha: దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:56 AM
రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతితోపాటు తెలంగాణ సమాజం సహించబోదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్
గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
బనకచర్ల ఆపమనే ధైర్యం లేదా?
బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలి: ఎమ్మెల్సీ కవిత
కవాడిగూడ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతితోపాటు తెలంగాణ సమాజం సహించబోదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని, నీళ్లు, నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్ది గట్టి గుండె కాబట్టే కాళేశ్వరం కట్టారని అన్నారు. ప్రాజెక్టుపై విచారణ చేపడుతున్నది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వాడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నిరసన దీక్ష, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపమని లేఖ రాయడానికి ధైర్యం లేదా? అని నిలదీశారు. ఈ విషయమై వెంటనే అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి లేఖలు రాసి.. జలదోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, అందుకే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఏమీ మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్యమకారుడు, ఎంపీ ఈటల రాజేందర్ అయినా బాధ్యత తీసుకోవాలని, నోరు కట్టేసుకొని అపవాదు తెచ్చుకోవద్దని సూచించారు. పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు సమస్యలు సాధారణమేనని, మేడిగడ్డలో కుంగిన పిల్లర్కు మరమ్మతులు చేయకుండా, కేసీఆర్కు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నెహ్రూ హయాంలో కట్టిన నాగార్జున సాగర్కు ఇబ్బంది వస్తే ఎన్టీఆర్ మరమ్మతులు చేయించారని, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో ఇబ్బందులుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపైనే తమకు అనుమానం ఉందని, సంబంధిత కాంట్రాక్టర్ను విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చనిపోతే సీఎం రేవంత్రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు నెల రోజుల సమయం ఇస్తున్నామని, ఆయా పార్టీల నేతలు స్పందించకపోతే గోదావరి జలాలను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి కార్యచరణ తీసుకుంటుందని తెలిపారు. గోదావరి జలాల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు కేటాయించే వరకూ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు సిగ్గు, శరం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తక్షణమే పొలాలకు నీళ్లు ఇవ్వాలని, ప్రాజెక్టులో 99 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు, వివిధ కులసంఘాల నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి