Kalvakuntla Kavitha: కేసీఆర్కు నోటీసులంటే.. తెలంగాణకు ఇచ్చినట్లే
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:40 AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అని, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు నోటీసులిచ్చినట్లేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆయనపై ఈగ వాలినా ఊరుకోం
కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
కేసీఆర్కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు
తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు ఏర్పాటు చేస్తాం
బీసీ బిల్లుపై కేంద్రం తాత్సారం.. బీజేపీకి సెగ తగిలేలా ఉద్యమిస్తాం: కవిత
జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అని, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు నోటీసులిచ్చినట్లేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్పై ఈగ వాలినా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే.. తెలంగాణ జాగృతి మరో కన్ను అని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. శనివారం బంజారాహిల్స్లోని తన నివాసం సమీపంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల్లో 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలిపారు. ‘‘కాళేశ్వరం ద్వారా ఏటా 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చేసిందుకు నోటీసులు ఇచ్చారా ? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? లేక కాంగ్రెస్ కమిషనా?’’అని కవిత ధ్వజమెత్తారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని అన్నారు.
నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడరేం?
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ నీళ్లను తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి మాట్లాడని పరిస్థితి ఏర్పడిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అంత బలహీనంగా ఎందుకున్నారని, పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టేలా ప్రతిపాదించారని, కానీ.. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడతామని చెప్పిందని అన్నారు. కానీ, ఇప్పుడు పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. జూన్ 2 నాడు సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
గ్రహచారం బాగోలేక రేవంత్ సీఎం అయ్యారు
సీఎం రేవంత్రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని, తెలంగాణ గ్రహచారం బాగాలేక రాష్ట్రానికి రేవంత్రెడ్డి సీఎం అయ్యారని కవిత వ్యాఖ్యానించారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పిడికిలెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందని, దానివల్లే ఇవాళ అధికారంలో ఉన్నామన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్కు నోటీసులివ్వడం దారుణమన్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రారంభిస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఎటువంటి సంబంధంలేని రాజీవ్గాంధీ పేరు పెట్టడం సరికాదన్నారు. అమరులు శ్రీకాంతచారి, యాదిరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదించిన బీసీ బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా తాత్సారం చేస్తోందని కవత మండిపడ్డారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు తప్ప.. బీసీ బిల్లు మీద మాట్లాడలేదని ఆరోపించారు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుందని అన్నారు.
జాగృతి కమిటీల ఏర్పాటు..
మైనారిటీల హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని కవిత ప్రకటించారు. జాగృతిలో మైనారిటీల హక్కల కోసం ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామన్నారు. అయితే, తాము పోరాటాలు చేస్తుంటే కొంతమంది ఓర్వడం లేదన్నారు. తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణమని, 8మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ చూపిస్తామన్నారు. కాగా, తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీరావును నియమిస్తున్నట్లు ఆ కార్యాలయం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News