Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!
ABN , Publish Date - May 24 , 2025 | 02:58 AM
కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

పార్టీలో నాపై అంతర్గత కుట్రలు, కుతంత్రాలు.. కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి
కేసీఆర్ దేవుడు.. ఆయనే మా నాయకుడు
నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు
రాసింది నేనే.. తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా
పార్టీలో అన్ని స్థాయులవారూ అనుకుంటున్న విషయాలనే నేను ఆ లేఖలో ప్రస్తావించాను
నా లేఖే బయటపడితే ఇతరుల పరిస్థితేంటి?
లోపాలపై చర్చించాలి.. కోవర్టుల్ని తప్పించాలి
అప్పుడే పార్టీ పదికాలాలపాటు చల్లగా ఉంటుంది
అమెరికా నుంచి తిరిగొచ్చిన కవిత వ్యాఖ్యలు
ఆమె చెప్పిన ‘దయ్యాలెవరు?’ అంటూ విస్తృత చర్చ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ శంషాబాద్ రూరల్): ‘‘కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది’’ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఆమె.. ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి.. లేఖ లీక్ అయ్యిందంటూ హంగామా జరుగుతోందని, ఆ లేఖ రెండు వారాల క్రితం కేసీఆర్కు తాను రాసిందేనని స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభ తరువాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని.. కేసీఆర్కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగతఎజెండా లేదని ఆమెస్పష్టం చేశారు. పార్టీలో అన్ని స్థాయుల్లో ఉన్న వారూ అనుకునే విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలను మాత్రమే తాను లేఖలో రాశానని చెప్పారు. ‘‘నేను కేసీఆర్కు లేఖలు రాయడం కొత్తేమీ కాదు. ఆయనకు తరచుగా సమాచారం (ఫీడ్ బ్యాక్) ఇస్తాను. నేను లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు’’ అని ఆమె తేల్చిచెప్పారు. కానీ, ఈసారి తాను రాసిన లేఖ బయటికి రావడం బాధాకరమన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషంగానీ ప్రేమగానీ లేవని ఆమె పేర్కొన్నారు. అయితే, తన తండ్రికి తాను అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారనే విషయాన్ని పార్టీనాయకులు, తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచించాలని.. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. ‘‘కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. ఇక సామాన్యుల సంగతేంటి?’’అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనపై అంతర్గత కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్న విషయాన్ని తాను ఇటీవలే బహిరంగంగానే చెప్పానని గుర్తుచేశారు. ఇవే విషయాలను ఆమె జాతీయ మీడియా కోసం ఆంగ్లంలో కూడా చెప్పారు.
కోవర్టులను పక్కకు తప్పిస్తేనే...
కేసీఆరే తమ నాయకుడని.. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడతది, ముందుకు పోతదని కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై అంతర్గతంగా చర్చించుకుంటూ, సవరించుకుని, కోవర్టులను పక్కకు తప్పించుకుంటూ ముందుకుపోతేనే పార్టీ పదికాలాల పాటు చల్లగా ఉంటుందన్నారు. తన లేఖ బయటకు రావడం చూసి.. బీఆర్ఎస్ పార్టీ ఆగమైందన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, ఆ రెండు పార్టీలూ తెలంగాణను అన్ని రకాలా విఫలం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు పార్టీ పెడుతున్నారనే ప్రచారం నిజమేనా? మీకు కేసీఆర్ వద్ద యాక్సెస్ లేదా?’’ అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం దాటవేశారు. కాగా.. ‘డాడీ చుట్టూ దయ్యాలున్నాయి’ అంటూ ఎయిర్పోర్టులో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. విమానాశ్రయంలో కవితకు స్వాగతం చెప్పేందుకు వచ్చినవారు సైతం ‘ఆ దయ్యాలెవరు?’ అంటూ చర్చించుకోవడం కనిపించింది. మరోవైపు.. బీఆర్ఎ్సతో సంబంధం లేకుండా ఆమె వర్గీయులు స్వాగత ఏర్పాట్లు చేయడంపై పార్టీలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.
లాంజ్లో 40 నిమిషాలు
అమెరికా నుంచి తన కుటుంబసభ్యులతో రాత్రి 8:10 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కవిత దాదాపు 40నిమిషాల పాటు లాంజ్లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమె స్నాక్స్ తీసుకుని కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సమాచారం. అలాగే.. ఎయిర్పోర్టు బయట పెద్ద ఎత్తున వేచి ఉన్న మీడియాతో ఏం మాట్లాడాలనే అంశంపైనా ఆమె కొంత కసరత్తు చేసినట్లు తెలిసింది. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె ప్రత్యేక కాన్వాయ్లో అక్కణ్నుంచీ బయల్దేరి వెళ్లిపోయారు.
జాగృతే.. బీఆర్ఎస్ శ్రేణులు రాలే!
శంషాబాద్ రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి ): కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై అమెరికా నుంచి శుక్రవారం రాత్రి భారత్కు తిరిగొచ్చిన ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ‘తెలంగాణ జాగృతి’ ఘనస్వాగతం పలికింది. జాగృతి సభ్యులు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు తరలిరావడంతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. కవిత, ఆమె భర్త, ఇద్దరు కుమారులకు.. అభిమానులు, జాగృతి నాయకులు, పుష్పాగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. కవిత ఫోటో ఉన్న కటౌట్లు పట్టుకుని జాగృతి నేతలు ఎయిర్పోర్టు బయట వరుసగా నించున్నారు. బీసీ కులసంఘాల పేరుతో కూడా బ్యానర్లు కనిపించాయి. కవిత ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే వారంతా.. ‘‘కవితక్క జిందాబాద్.. కవితక్క సీఎం..’’ అంటూ నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతమంటూ ఏర్పాటు చేసిన ఆ బ్యానర్లలో ఎక్కడా బీఆర్ఎస్ అనే పదం గానీ, పార్టీ ప్రస్తావనగానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఫోటోలుగానీ కనిపించకపోవడం.. అవన్నీ గులాబీ రంగులో కాక నీలిరంగులో ఉండడం, టీమ్ కవితక్క పేరుతో కటౌట్లు ఏర్పాటుచేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇక.. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ విమానాశ్రయానికి రాలేదు. స్ధానికంగా జాగృతితో సంబంధం ఉన్న కొందరు నేతలు వచ్చినా గుర్తుపట్టగలిగేవారెవరూ లేరు. వచ్చిన వందలాది మంది అభిమానుల్లో ఒక్కరి వద్ద సైతం బీఆర్ఎస్ జెండా, కండువా లేకపోవడం, వారంతా ‘కవితక్క జిందాబాద్’ అనడం తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా.. కవితకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన అభిమానులు పట్టుకున్న కవిత సింగిల్ ఫోటోతో ఉన్న ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్న కల్వకుంట్ల కవిత అక్కకు స్వాగతం సుస్వాగతం అని వాటిలో ఉంది.
నేడు తండ్రి వద్దకు కవిత ?
తాను రాసిన లేఖ బహిర్గతం కావడంపై మాట్లాడే అవకాశం
ఎర్రవెల్లి ఫామ్హౌ్సలోనే కేసీఆర్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రజ్యోతి, మే 23 : ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ పార్టీలో కలకలం రేపుతుండగా.. కేసీఆర్ నివాసముంటున్న ఎర్రవల్లి ఫామ్హౌ్సలో మాత్రం ఎలాంటి అలికిడి కనిపించడం లేదు. మరోపక్క, అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఆ లేఖ తానే రాశానని విమానాశ్రయం వద్ద విలేకరులతో అన్నారు. అయితే, ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తండ్రి దగ్గర ఉన్న లేఖ బహిరంగం కావడంపై.. ఆమె నేరుగా కేసీఆర్తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారనిప్రచారం జరిగింది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి ఎర్రవల్లి ఫామ్హౌ్సకు నేరుగా వెళతారని తొలుత అంతా భావించారు. కానీ, హైదరాబాద్లోని తన నివాసానికే కవిత వెళ్లారు. కానీ, శనివారం ఏదో ఒక సమయంలో ఆమె కేసీఆర్ను కలిసే అవకాశముందని సమాచారం. అయితే, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో కుంపటి రేపుతున్న కవిత లేఖపై కేసీఆర్, ఆ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..