సన్న వడ్లకు బోనస్ ఎప్పుడు?
ABN , Publish Date - May 18 , 2025 | 12:33 AM
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సన్నరకాల బోనస్ ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ సీజన్లో కొనుగోలు చేసిన సన్న, దొడ్డు ధాన్యానికి చెందిన డబ్బుల్లో 83 శాతం ఇప్పటికే చెల్లించింది. సన్న ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ఇస్తానన్న బోనస్ సొమ్ము మాత్రం ఇప్పటికీ చెల్లించ లేదు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సన్నరకాల బోనస్ ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ సీజన్లో కొనుగోలు చేసిన సన్న, దొడ్డు ధాన్యానికి చెందిన డబ్బుల్లో 83 శాతం ఇప్పటికే చెల్లించింది. సన్న ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ఇస్తానన్న బోనస్ సొమ్ము మాత్రం ఇప్పటికీ చెల్లించ లేదు. జిల్లాలో వరి కోతలు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే 86 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మూసేశారు. అయినా సన్నధాన్యం పండించిన రైతులకు మాత్రం చెల్లించాల్సిన 13.85 కోట్ల రూపాయలు ఇంకా బకాయిగానే ఉంచారు.
ఫ 27,695 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఈ సంవత్సరం 325 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 40,696 మంది రైతులకు చెందిన 2,58,195 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,30,499 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా 27,695 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నరకానికి చెందినది ఉన్నది. ఈ సన్నరకం ధాన్యంపై ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ఒక మెట్రిక్ టన్ను ధాన్యంపై 5 వేల రూపాయలు బోనస్గా చెల్లించాల్సి ఉన్నది. జిల్లాలో కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి 13 కోట్ల 85 లక్షల రూపాయలు రైతులకు బోనస్గా చెల్లించాల్సి ఉన్నది. ఈ బోనస్ చెల్లించాలని ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను తెలుపుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నా అందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం ఇప్పటికి రాలేదు. జిల్లాలో కొనుగోలు చేసిన దొడ్డు, సన్నరకం ధాన్యం విలువ 599 కోట్ల రూపాయలు కాగా 83 శాతం సొమ్ము చెల్లించారు. 40,696 మంది రైతుల నుంచి 2,58,195 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, దీనికి 599 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 33,622 మంది రైతులకు సంబంధించిన 2,13,605 మెట్రిక్ టన్నుల ధాన్యానికిగాను 495 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించారు. ఇప్పటికి 103 కోట్ల 43 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రక్ షీట్ జనరేట్ చేసి మిల్లర్లకు ధాన్యం పంపిస్తుంటారు. ధాన్యం పంపించిన వెంటనే మిల్లర్ వాటిని తీసుకుని తమకు ధాన్యం అందినట్లుగా అధికారులకు సమాచారం అందిస్తారు. ఆ వెనువెంటనే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. ఈ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతున్న కారణంగా రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఈ నెల 17 వరకు 40,696 మంది రైతుల నుంచి 2,58,195 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగా, 38,947 మంది రైతులకు చెందిన 2,47,162 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అందులో 36,839 మంది రైతులకు సంబంధించిన ధాన్యానికి ట్రక్ షీట్ జనరేట్ కాగా 34,438 మంది రైతులకు సంబంధించిన ధాన్యం 2,18,765 మెట్రిక్ టన్నులు తమకు అందినట్లు మిల్లర్లు సివిల్ సప్లయిస్ శాఖకు సమాచారం అందించారు. మిగతా వివరాలు అందగానే అందరు రైతుల ఖాతాల్లో ఇంకా బకాయి ఉన్న 103.43 కోట్ల రూపాయలు సివిల్ సప్లయిస్ శాఖ జమ చేస్తుంది. ప్రభుత్వం వెంటనే బోనస్ సొమ్ము విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.