Share News

పేదలకు అండగా ఉంటాం..

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:41 AM

ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు.. పేదోడైతే చాలనుకున్నాం.. ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని, చివరకు పింకు షర్టు తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తామని, తల తాకట్టు పెట్టయినా పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

 పేదలకు అండగా ఉంటాం..

పెద్ద్దపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు.. పేదోడైతే చాలనుకున్నాం.. ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని, చివరకు పింకు షర్టు తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తామని, తల తాకట్టు పెట్టయినా పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఎలిగేడు, పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌ నూతన పోలీస్‌ స్టేషన్ల ఆరంభం, పెద్దపల్లి పట్టణంలో రూ.4.25 కోట్లతో నిర్మించనున్న సమీకృత కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి చందపల్లి, రాంపెల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం చందపల్లిలో జరిగిన బహిరంగ సభలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వాడికి అండగా ఉంటూ ఇందిరమ్మ పాలనను చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కళ్లుండి కబోదిలా మారారని, సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని విమర్శిస్తున్నా రని, ఇక్కడ ఓ చెల్లెమ్మను సన్న బియ్యంలో పురుగులున్నాయని అంటున్నారని అడిగేతే.. వాళ్ల నోట్లో పురుగులు పడ.. బియ్యంలో ఎక్కడ పురుగులున్నాయని చెప్పారని ఎదురు ప్రశ్నించిందని అన్నారు. అందరితో సమానంగా పేదల కడుపు నింపామని అంటూ ఆ మహిళ సమాధానంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు వెలగ బెట్టిందేమి లేదని, 8 లక్షల 19 కోట్ల రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు అండగా ఉండేం దుకు రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపట్టాలని, ఇందుకు 22,500 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేసి తీరతామని అన్నారు. నాటి ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లను పూర్తి చేసి ఇస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే సన్న బియ్యం అందిస్తున్న చరిత్ర ఏ రాష్ట్రా నికి లేదన్నారు. సన్న వడ్లకు 500 బోనస్‌ ఇస్తున్నామని, 21 కోట్ల రూపాయల వరకు రైతులకు ఏక కాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణి వల్ల తమ భూములపై భరోసా లేకుండా చేసింది. దాని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుక వచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 శాతం వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయని మంత్రి అన్నారు.

సన్నబియ్యంతో కుటుంబానికి నెలకు రూ. 2 వేల వరకు ఆదా

ఎన్నికల సందర్భంగా సన్నబియ్యం ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి సన్నబియ్యంతో 2 వేల రూపాయల వరకు ఆదా అవుతు న్నాయన్నారు. ఆయకట్టు చివరి ప్రాంతాలకు సాగునీరు అందించేం దుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. అర్హత ఉండి ఇండ్లు రాని వారు ఆందోళన చెందవద్దని, రాబోయే దశలలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలిపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కూడా 6 కోట్ల రూపాయలతో తాగు నీరు, సిమెంట్‌ రోడ్లు, డైన్రేజీ, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక వసతులు పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌, డీసీపీ కరుణాకర్‌, అదనపు కలెక్టర్లు డి వేణు, జే అరుణశ్రీ, పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్‌ రావు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:41 AM