జిల్లాను హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - May 12 , 2025 | 12:51 AM
జిల్లాను హెల్త్ కేర్ హబ్గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో మెడికల్ అండ్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జగిత్యాల, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాను హెల్త్ కేర్ హబ్గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో మెడికల్ అండ్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాల, మాతా శిశు కేంద్రానికి అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు. జగిత్యాల జనరల్ హాస్పిటల్కు ఎంఆర్ఐ, స్కానింగ్ కేంద్రాన్ని మంజూరు చేస్తామని తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిలో గల మూడు డయాలసిస్ సెంటర్ల రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. జిల్లాను వైద్య పరంగా మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నూటికి నూరు శాతం డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇందుకు ప్రతీ గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశాలు కృషి చేయాలన్నారు. సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం జగిత్యాల, ధర్మపురి, వేములవాడ పరిధిలో ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు. చేశామన్నారు. జిల్లాకేంద్రంలో సెంట్రల్ డ్రగ్ సెంటర్ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులు, సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునికమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి
-ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జిల్లాలో వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిల అభివృద్ధికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. రోడ్డు ప్రమాద బాధితుల కొరకు ట్రామాకేర్ సెంటర్లను మంజూరు చేయాలన్నారు. జిల్లాను మెడికల్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దృష్టి సారించడం సంతోషదాయకమన్నారు. నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించిన రూ.6 కోట్లు, వైద్య విధాన పరిషత్కు రూ. 6.25 కోట్లు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రూ.74 లక్షలు, మెడికల్ కళాశాల భవనానికి సుమారు రూ.40 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఎంసీహెచ్ ఏర్పాటు చేయాలి
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 50 పడకల మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడకు ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, భీమారం మండలాలకు 108 వాహనాలు మంజూరు చేయాలని కోరారు. వేములవాడలో వంద పడకల ఆసుపత్రికి సరిపడా వైద్యులు, ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయాలన్నారు. సూరమ్మ చెరువురు రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ భూసేకరణ కోసం నిధులు మంజూరు చేయాలన్నారు.
వైద్య విధాన పరిషత్ భవన నిర్మాణం పూర్తి చేయాలి
-కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లిలో వైద్య విధాన పరిషత్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరారు. కోరుట్ల నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు విన్నవించానని గుర్తు చేశారు. మెట్పల్లి పట్టణంలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అలా్ట్రసౌండ్ స్కాన్ మిషిన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా అందులో వైద్యుల కొరత ఉన్నందున వైద్యులను నియమించాలని కోరారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల నాలుగు మండలాలకు అంబులెన్స్లు కావాలని తెలిపారు. కోరుట్ల పట్టణంలో గల వంద పడకల ఆసుపత్రిలో అవసరమయ్యే పరికరాలను త్వరితగతన అందజేయాలని విన్నవించారు. కోరుట్ల నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ భవనాలను త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్
జిల్లాకు అవసరమైన డ్రగ్స్ పెండింగ్ బిల్లు మంజూరు ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ రిపేర్ చేయాలన్నారు. జగిత్యాల నూకపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసి అవసరమైన సిబ్బంది నియమించాలని కోరారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు మూడు బస్లు మంజూరు చేయాలని, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సూపరిండెంట్లను నియమించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఖాద్రి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ పాల్గొన్నారు.