ఏడాదిన్నరగా ఎదురుచూపులు
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:45 AM
సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు.

జగిత్యాల, (ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు. పెట్టుబడి సాయం అందకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట సాగుతో వచ్చిన కొంత మొత్తంతో వడ్డీలు కట్టలేక ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రతీ సీజన్లో ప్రభుత్వం నుంచి సహాయం అందక పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.
- జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు..
జిల్లాలో సుమారు 30వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు అంచనా ఉంది. అరెకరం, ఎకరం భూమి ఉన్న రైతులు ప్రతీఏటా తమకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల భూముల కౌలుకు తీసుకొని పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. గతేడాది పసుపు, మొక్కజొన్న, పత్తి తదితర సాగుకు ఎకరాకు కౌలుకు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం 20,000 వరకు పెరిగింది. వరి పొలాలకు 10,000 రూపాయల వరకు భూ యజమానులు కౌలు రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుంది. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. దీంతో కౌలు, చిన్న, సన్న కారు రైతులు పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నారు.
- సాయంపై స్పష్టత కరువు..
ఇప్పటికే జిల్లాలో వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించిన దాఖాలాలు లేవు. దీంతో కౌలు రైతులను గుర్తించే యోచన కూడా చేయలేదని తెలుస్తోంది. ఈ ఏడాది సైతం కౌలు సాయం రైతులకు చేరే అవకాశాలు కనిపంచడం లేదు.
- మూడు సీజన్లు గడుస్తున్నప్పటికీ....
ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామని స్పష్టంగా పేర్కొంది. అర్హులైన ప్రతీ కౌలు రైతుకు ఏడాదికి 15,000 వేల రూపాయల సహాయం అందిస్తారని ఆశపడ్డారు. ఆఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు సహాయం అందుతుందని రైతులు భావించినప్పటికీ నిరాశే మిగిలిపోయింది. మూడు సీజన్లు గడుస్తున్నప్పటికీ కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
కౌలు రైతులకు భరోసా కల్పించాలి..
- మారం సతీష్, కౌలు రైతు, బట్టపల్లి, సారంగాపూర్ మండలం
ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకొని భరోసా కల్పించాలి. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పంట సాగు చేస్తే అప్పులపాలు కావాల్సి వస్తోంది.. తప్ప రూపాయి మిగిలింది లేదు. ఓ పక్క పెరిగిన కౌలు, మరో పక్క విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులకు అధిక ధరలు ఉండటంతో పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఐదెకరాలు కౌలు చేస్తున్నా...
- జల్లిక ఎల్లయ్య, కౌలు రైతు, మారేడుపల్లి, ఎండపల్లి మండలం
ఐదెకరాలు కౌలుకు తీసుకొని పంట పండిస్తున్నా.. .గుంట భూమి సొంతం లేకున్నప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నా. కౌలు రైతులకు పెట్టుబడి సాయం సర్కారు అందిస్తుందని ఆశిస్తున్నాను. వానాకాలం సీజన్లోనైనా ప్రభుత్వం కౌలు రైతులకు సాయం అందించే ప్రక్రియ ప్రారంభించాలి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు
- భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
కౌలు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం రైతులు సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్వవసాయ శాఖ ద్వారా పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం. రైతులు నకిలీ విత్తనాల బారినపడి మోసపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.