Share News

ఆరుతడి పంటలు అంతంతమాత్రమే..!

ABN , Publish Date - May 04 , 2025 | 12:03 AM

జిల్లాలో ఆరు తడి పంటలకు ఆదరణ కరువవుతోంది. ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం పంటల సాగులో 75 శాతానికి పైగా వరి ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వరి సాగు కారణంగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరుతడి పంటలు అంతంతమాత్రమే..!

జగిత్యాల, మే 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు తడి పంటలకు ఆదరణ కరువవుతోంది. ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం పంటల సాగులో 75 శాతానికి పైగా వరి ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వరి సాగు కారణంగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలనే నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌లోనూ ఆరుతడి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

ఫదక్కని మద్దతు ధర

ఆరుతడి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు వరి సాగు విస్తీర్ణం ఏడాదికేడాది పెరుగుతోంది. సన్న ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించడం, ఆరుతడి పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో అంచనాలను మించి వరి సాగవుతోంది. పంటల సాగులో భారీ అంతరం కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బ తినడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థికంగా పెనుభారం పడుతోంది. అంతేకాకుండా అపరాలు, నూనెగింజలు, కూరగాయల సాగు వేగంగా పడిపోయి దిగుమతులపై ఆధారపడి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఫజిల్లాలో సాగు వివరాలు..

2024-25 వానాకాలం సీజన్‌లో 4,13,974 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 3,11,642 ఎకరాల్లో వరి పంట, మిగిలిన 1,02,332 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు అయ్యాయి. 2025 యాసంగి సీజన్‌లో జిల్లాలో 3,88,550 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 2,97,365 ఎకరాల్లో అంటే పూర్తి సాగులో అత్యధికంగా వరి పంట ఉండగా కేవలం 91,185 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. ఏడాది వ్యవధిలోనే సుమారు పదకొండ వేల ఎకరాల ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. 2025-26 వానాకాలం సీజన్‌ పంటల ప్రణాళిక ఖరారుకాగా జిల్లా వ్యాప్తంగా 4,14,419 ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 3,20,642 వరి ఎకరాల్లో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ లెక్కన ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

ఫమద్దతు ధర పెంచాలి

వరి సాగుతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక నష్టాలే ఎక్కువ అని రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటల సాగుకు కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. అపరాలు, చిరుఽధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, నువ్వు, గోధుమ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి. ఆరు తడి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను పెంచడమే కాకుండా సాగుకు అవసరమైన విత్తనాలు, సూక్ష్మ బిందు సేద్యం పరికరాలు, పంట మార్పిడి యంత్రాలను రైతులకు ఏటా రాయితీపై అందించాల్సి ఉంది. ఆరుతడి పంటల సాగుతో కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఫతగ్గుతున్న భూసారం

పంట మార్పిడి లేకుండా అంచనాలకు మించి వరిసాగు కారణంగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు విలువైన భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఓవైపు హానికరమైన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతుండగా, మరోవైపు రాయితీతో కూడిన ఎరువులు, విద్యుత్‌ రూపంలో ప్రభుత్వానికి భారం పడుతోంది. రసాయన ఎరువులు భూమిలో కలవడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతులు నీటి జాడ కోసం వందల ఫీట్ల లోతు బోరు బావులను తవ్విస్తున్నారు. అయినప్పటికీ నీరు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా భూ సారం కూడా తగ్గుతోంది. వరి పొలాల నుంచి గ్లోబల్‌ వార్మింగ్‌కి కారణమైన మిథేన్‌ వాయువు అధికంగా వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 04 , 2025 | 12:03 AM