సాదాబైనామాలకు మోక్షం
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:31 AM
భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది.
జగిత్యాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలో భూ భారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం 2024ను ప్రతిపాదించింది. ఈ చట్టంలో సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించే అంశం చేర్చడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది.
ఫఅత్యధికంగా మెట్పల్లిలో 4,489 దరఖాస్తులు పెండింగ్..
జిల్లా వ్యాప్తంగా 35,010 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మెట్పల్లిలో 4,489 దరఖాస్తులు, అత్యల్పంగా జగిత్యాలలో 318 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గొల్లపల్లిలో 1,000 దరఖాస్తులు, సారంగపూర్ 934, ఇబ్రహీంపట్నం 1,903, బుగ్గారం 984, పెగడపల్లి 1,840, వెల్గటూరు 2,809, మల్లాపూర్ 3,025, కథలాపూర్ 2,757, రాయికల్ 3,104,కొడిమ్యాల 837, జగిత్యాల రూరల్ 1,901, మేడిపల్లి 1,336, బీర్పూర్ 1,757, మల్యాల 737, ధర్మపురిలో 2,119 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
ఫబాండ్ పేపర్లపైనే..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా తెల్ల కాగితాలు, బాండ్ పేపర్ల పైనే భూ క్రయ విక్రయాలకు చెందిన అగ్రిమెంట్లు ఉన్నాయి. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన వారు మోకాపై ఉండడం, అమ్మినవారి పేర్లు పట్టాదారు పాస్బుక్లలో రావడంతో సదరు భూములు తమవేనంటూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన వారికి 2016 సంవత్సరంలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వాటిని పరిష్కరించిన తర్వాతే కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు.
ఫ2020కి ముందు దరఖాస్తులకు పరిష్కారం
2020 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించింది. 2020 అక్టోబర్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ యేడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 2020కి ముందు సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో లైన్ క్లియర్ అయింది. ఆ వెంటనే సాదాబైనామాలకు పరిష్కారాలు చూపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫభూ భారతిలో ప్రతిపాదన..
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం 2024ను ప్రతిపాదించింది. దీనిలో సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే అంశం చేర్చడంతో గతంలో సాదాబైనామాలకు పట్టాలు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలు అధికంగా ఉండటంతో చిన్న, సన్న కారు రైతులు సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. 2019 నుంచి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు రెవెన్యూ కార్యాలయాల్లో సాగుతుండగా అంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికి రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేసి పట్టాలను జారీ చేసేవారు. ఈ తంతు వల్ల వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడేది. కొత్త రెవెన్యూ చట్టం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామాలకు మోక్షం కల్పించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మొర ఆలకించి కొత్త చట్టం ద్వారా సాదా బైనామాలకు పట్టాలను జారీ చేసే విషయాన్ని తెరపైకి తీసుకొని రావడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
సాదా బైనామాలకు పట్టాలు హర్షణీయం
- గాజెంగి నందయ్య, కాంగ్రెస్ నాయకుడు
సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం మంచి నిర్ణయమే. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ రేవంత్రెడ్డి సర్కారు రైతుల ప్రధాన సమస్యకు పరిష్కారం చూపనుంది. ఎంతో మందికి సాదాబైనామాలకు పట్టాలు జారీ చేసే అవకాశం లభించనుంది.
రైతులకు ప్రయోజనం కలగనుంది
-అల్లూరి మహేందర్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్
సాదా బైనామాలకు పట్టాలను జారీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీఎం రేవంత్రెడ్డికి రైతులు రుణ పడి ఉంటారు. సాదా బైనామాలకు పట్టాల జారీ కోసం ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. వారందరికీ తొందరలోనే పట్టాలు జారీ అయ్యే అవకాశం కలిగింది.