పల్లె పోరుకు సన్నాహాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:43 AM
పల్లె పోరుకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీలో పొలిటికల్ సందడి మొదలైంది. 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పల్లె పోరుకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీలో పొలిటికల్ సందడి మొదలైంది. 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. కార్యదర్శులు అప్పులు తెచ్చి పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్న తీరు కనిపిస్తోంది. చివరకు డీజిల్ కూడా పోయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడంతో గ్రామాల్లో ఆశావహులు మళ్లీ ముందుకు వస్తున్నారు. గతంలోనే ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసిన అధికారులకు మళ్లీ ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సేకరించిన సమాచారంలో మార్పులుచేర్పులు ఉంటే సవరించి టీ-పోల్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు మళ్లీ దృష్టి సారించారు. గతంలో ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఉద్యోగులు ఉన్నారా... కొత్త ఉద్యోగులు వచ్చారా.. అనే విషయాలపై ఇప్పటికే ఆరాతీసి కొత్తవారు వస్తే వారి వివరాలు టీ-పోల్లో అప్డేట్ చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం చెప్పినట్లు జూలైలో ఎన్నికలు వచ్చినా అధికార యంత్రాంగం మాత్రం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధంగా ఉన్నారు. 2019 గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించింది. ఈసారి కూడా మొదట్లో మూడు విడతలుగా ఏర్పాటుచేసినా రెండు విడతల్లోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించడం, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో మొదటి విడతలో 137 సర్పంచ్లు, 1,888 వార్డులు, రెండో దశలో 123 గ్రామాలు, 1,080 వార్డుల్లో ఎన్నికల నిర్వహాణకు సిద్ధం చేశారు.
ఆశావహుల పల్లె బాట..
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ఆశావహులు, మాజీ సర్పంచులు మళ్లీ పల్లె బాట పట్టారు. రిజర్వేషన్ల ప్రక్రియ తేలిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని భావించి పల్లెలకు దూరమైన ఆశావహులు పల్లెల్లో మళ్లీ మద్దతు కూడగట్టుకునే పనిలో పడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సభలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు పాల్గొంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యాన్ని చాటుకునే దిశగా బీఆర్ఎస్, బీజేపీలు తమ క్యాడరును అప్రమతం్త చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే బరిలోకి దిగే విధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో సందిగ్ధత తొలగడం లేదు.
జిల్లాలో 3.46 లక్షల మంది ఓటర్లు..
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కీలకంగా ఉండే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 260 గ్రామ పంచాయతీల్లో 3 లక్షల 46 వేల 259 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది, 20మంది జెండర్ ఓట్లు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉండే పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు, 134 ఉండగా, 400 ఓటర్లు ఉన్నా కేంద్రాలు 468 ఉండగా, 650 ఓటర్లు ఉన్నవి 76 కేంద్రాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ల ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, పుట్బాల్, బ్యాట్, బ్యాట్స్మెన్, స్టంప్స్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ తదితర గుర్తులు ఉన్నాయి. వార్డు సభ్యులకు సంబంధించి పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, గరాట, ముకుడు, డిష్ యాంటీనా, ఐస్క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైక్ టై, విద్యుత్ స్థంబం, షటిల్, గుర్తులు కేటాయించారు. గుర్తుల్లో కొన్ని గుర్తుంచుకోవడం కష్టమే అన్నట్లుగా భావిస్తున్నారు.
వీడని రిజర్వేషన్ల సందిగ్ధత..
సామాజిక వర్గాల రిజర్వేషన్లు సందిగ్ధత మాత్రం వీడటం లేదు. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన కూడా చేపట్టే అవకాశాలు ఉండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అని అభిప్రాయంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచేందుకు సవరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సవరణ కావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జులైలో ఎన్నికలంటూ ఆశలు కల్పిస్తున్నారు. దీంతో ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు అయోమయంలో పడ్డారు. 2024జనవరి నెలలో సర్పంచులు, వార్డు సభ్యుల పదవి కాలం ముగిసి 16 నెలలు గడుస్తున్నా ఎన్నికలపై ఇప్పటికి గందరగోళ పరిస్థితి మాత్రం వీడటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటూ అధికారులు, ఆశావహులు ఉన్నారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు..
మండలం పురుషులు మహిళలు మొత్తం
బోయినపల్లి 14,681 15,595 30,276
చందుర్తి 13,220 14,394 27,614
ఇల్లంతకుంట 19,391 20,512 39,903
గంభీరావుపేట 17,543 18,639 36,183
కోనరావుపేట 16,795 17,666 34,461
ముస్తాబాద్ 18,529 19,613 38,142
రుద్రంగి 6,234 7,006 13,243
తంగళ్లపల్లి 18,372 19,432 37,804
వీర్నపల్లి 5,713 5,836 11,549
వేములవాడ 8,877 9,296 18,189
వేములవాడరూరల్ 8,914 9,699 18,613
ఎల్లారెడ్డిపేట 19,417 20,865 40,282
----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,67,686 1,78,553 3,46,259(జెండర్ 20)
----------------------------------------------------------------------------------------------------