Share News

ప్రజల వద్దకు పోలీసులు

ABN , Publish Date - May 12 , 2025 | 12:54 AM

ప్రజలకు పోలీసులు దగ్గరవ్వాలని, ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని డీజీపీ జితేందర్‌ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ మేరకు సీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా విజిబుల్‌ పోలీసింగ్‌ను పకడ్భందీగా అమలు చేస్తున్నారు.

ప్రజల వద్దకు పోలీసులు

కరీంనగర్‌ క్రైం, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు పోలీసులు దగ్గరవ్వాలని, ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని డీజీపీ జితేందర్‌ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ మేరకు సీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా విజిబుల్‌ పోలీసింగ్‌ను పకడ్భందీగా అమలు చేస్తున్నారు. పోలీసు అధికారులు కార్యాలయాలలోనే ఉండకుండా క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఎక్కడికక్కడ పరిష్కారిస్తున్నారు.

కాలనీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు

బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, మార్కెట్‌ ప్రాంతాల వంటి రద్దీ ప్రదేశాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమాలు పెంచుతున్నారు. దీనిలో భాగంగా పట్టణాల్లోని కాలనీల్లో, గ్రామాల్లో సైబర్‌ నేరాలపై, డ్రగ్స్‌, మూఢనమ్మకాలు, తదితర నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మండలస్థాయిలోనూ రోజుకో గ్రామం, పల్లెకు వెళుతున్న పోలీసులు స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానికులతో సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ మోసాలు జరిగే తీరు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

ముమ్మరంగా తనిఖీలు

నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద స్టాటిక్‌ పికెట్స్‌తోపాటు పలుచోట్ల వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టణాల్లోని కాలనీల్లో, గ్రామాలతో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే వారిని విచారిస్తూ వేలిముద్రలు సేకరించి డాటాబేస్‌లో అప్‌లోడ్‌ చేస్తూ గతంలో ఏవైనా నేరఘటనల్లో ప్రమేయం ఉందా అనేది నిర్ధారించకుంటున్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో పోలీసులతోపాటు డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలతో పోర్టబుల్‌ ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా సంచరించే బస్టాండ్లు, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో నిరంతర పెట్రోలింగ్‌, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంఘ విద్రోహశక్తులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.

పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా హెచ్చరికలు, సూచనలు

బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువుల గురించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. సోషల్‌ మీడియాపై నిరంతర నిఘాపెట్టారు. గ్రామాల్లోనూ పోలీసులు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో నక్సల్స్‌ సమస్య ఉన్న సమయంలో పోలీసులు గ్రామాలకు వెళ్లడానికి గ్రూపుగా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. నక్సల్స్‌ ప్రాబల్యం తగ్గడంతో పోలీసులు మారుమూల గ్రామాలకు కూడా ఒంటరిగా వెళుతున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి వెళుతై బ్లూకోల్ట్స్‌ పోలీసులు రౌండ్‌ ద క్లాక్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Updated Date - May 12 , 2025 | 12:54 AM