వాణిజ్య కేంద్రంగా ఫూలే పార్కు
ABN , Publish Date - May 04 , 2025 | 12:06 AM
అహ్లాదంతో పాటు వాకింగ్ ట్రాక్తో ఆరోగ్యాన్ని అందించాలని నగరంలోని ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే పార్కును వాణిజ్య కేంద్రంగా మార్చుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా క్రీడా మైదానంగా ఉన్న జ్యోతిబాపూలే మైదానాన్ని స్మార్ట్ సిటీలో భాగంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించారు. అందులోనే వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు.

కరీంనగర్ స్పోర్ట్స్, మే 3 (ఆంధ్రజ్యోతి): అహ్లాదంతో పాటు వాకింగ్ ట్రాక్తో ఆరోగ్యాన్ని అందించాలని నగరంలోని ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే పార్కును వాణిజ్య కేంద్రంగా మార్చుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా క్రీడా మైదానంగా ఉన్న జ్యోతిబాపూలే మైదానాన్ని స్మార్ట్ సిటీలో భాగంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించారు. అందులోనే వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థ అధికారులు పార్కు నిర్వహణకు కాంట్రాక్టర్కు లీజుకు ఇచ్చారు. కాంట్రాక్టు పొందిన సదరు ఏజెన్సీలు నిబంధనలను మీరి పూర్తిగా వాణిజ్య కేంద్రంగా జ్యోతిబాపూలే పార్కును మారుస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చే నగరపౌరులకు, వాకింగ్ ట్రాక్పై ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వాకర్స్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పార్కులో ఎగ్జిబిషన్ సామగ్రి
పార్కును కాంట్రాక్టు పొందిన వ్యక్తులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు. దీంతో పార్కు మధ్యలో ఉన్న మైదానంలో ఎగ్జిబిషన్ సామగ్రిని పెద్ద మొత్తంలో దించారు. ఈ సామగ్రిని తీసుకువస్తున్న పెద్దపెద్ద లారీలు, ట్రక్కులు పార్కులో నిర్మించిన వాకింగ్ ట్రాక్ పై నుండి వెళ్లడంతో వాకింగ్ ట్రాక్ పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే 90 రోజులపాటు ఎగ్జిబిషన్కు ఈ పార్కును ఇవ్వడంతో ఇందులో కోట్లు వెచ్చించిన నిర్మించిన వివిధ సుందర ప్రదేశాలు, మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ వేసవిలో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాల్సిన పార్కు నగరవాసులకు దూరం కానుంది. 90 రోజులపాటు ఈ వాకింగ్ ట్రాక్ కూడా వాకర్స్కు అందుబాటులో లేకుండా పోతుంది.
పార్కులో ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లు
రంజాన్ సందర్భంగా జ్యోతిబాపూలే మైదానంలోనే హాలీం స్టాల్స్ను ఏర్పాటు చేశారు. దీంతో 30 రోజులపాటు ఈ మైదానంలోని ట్రాక్ పూర్తిగా వాకింగ్కు అనువుగా లేకుండా పోయింది. స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ఇక్కడే వంటకాలు, ఆహార పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో పార్కు మొత్తం దుర్గంధభరితంగా మారింది. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి ఈ మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అనుమతి ఇచారు.. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పార్కులో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ అనుమతి రద్దు చేయాలని వాకర్స్ కోరుతున్నారు.