ఇన్చార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా..?
ABN , Publish Date - May 27 , 2025 | 12:52 AM
ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో నిత్య చైతన్యంగా ఉండే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, శ్రేణులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకు ఇక్కడ తమ పార్టీ అధికారంలోనే ఉందా.. ఇన్చార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా.. ఉంటే నెలలు గడిచినా ఆయన జిల్లాకు ఎందుకు రాడు, జిల్లా కేంద్రానికి కీలకంగా ఉండే కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు కావడం లేదు.. అసలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలే ఎందుకు ఏర్పాటు కావడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో నిత్య చైతన్యంగా ఉండే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, శ్రేణులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకు ఇక్కడ తమ పార్టీ అధికారంలోనే ఉందా.. ఇన్చార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా.. ఉంటే నెలలు గడిచినా ఆయన జిల్లాకు ఎందుకు రాడు, జిల్లా కేంద్రానికి కీలకంగా ఉండే కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు కావడం లేదు.. అసలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలే ఎందుకు ఏర్పాటు కావడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఏడాదిన్నరగా ఒక్కటే సమీక్షా సమావేశం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాకు ఉత్తమ్కుమార్రెడ్డిని ఇన్చార్జి మంత్రిగా నియమించారు. ఏడాదిన్నర గడిచినా ఆయన ఒకే ఒక సమీక్షా సమావేశంతో సరిపెట్టుకున్నారు. ఆ సమావేశం కూడా రసాభాసాగా మారడంతో మళ్లీ ఆయన జిల్లాలో సమావేశం ఏర్పాటుకే ముందుకు రావడం లేదు అనే మాట వినిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో డి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరో మరేమోగాని సఖ్యత లేకుండా పోయింది. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరుంటే ఒకరు రారు. వీరిద్దరిలో ఎవరి వద్దకు వెళ్లాలన్నా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరి వద్దకు వెళితే వారి ముద్ర పడిపోతుందేమోననే భయంతో కార్యకర్తలు ఎటూ వెళ్లలేకపోతున్నారు.
జిల్లాకు వచ్చిందే మూడుసార్లు
ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా ముగిసింది. అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితి వరకు వెళ్లింది. కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్కు మైక్ ఇవ్వవద్దని, ఆయన ఏ పార్టీనో చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అడ్డుకుని ప్రశ్నించడమే కాకుండా ఆయనపై దాడి చేసినంత పనిచేశారు. అదే స్థాయిలో సంజయ్కుమార్ కూడా తీవ్ర పదజాలంతో జవాబిచ్చారు. పోలీసులు కౌశిక్రెడ్డిని బయటకు పంపించాల్సి వచ్చింది. దీని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమీక్షను నిర్వహించలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోదరుని వరుస కావడంతో సమావేశంలో జరిగిన వ్యవహారంతో ఆయన తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురై ఆ తర్వాత సమావేశం ఏర్పాటుకే ఆసక్తి చూపించలేదనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది.
నియోజకవర్గంలో ఆధిపత్య పోరు
కరీంనగర్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఆయనకు మింగుడు పడడం లేదని తెలుస్తున్నది. కరీంనగర్ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుగా మారుతున్నాయనే అభిప్రాయం ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్ అసెంబ్లీకి, పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఆయన ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలి హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉన్నా దాని పరిధిలోని రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఆయన కరీంనగర్కు చెందిన వారు. ఇక్కడి రాజకీయాలతో బలమైన సంబంధాలు ఉన్నారు. ఈ జిల్లా నుంచి మంత్రిగా వేరెవరికి అవకాశం కల్పించకపోవడంతో తాను ఆ బాధ్యతను నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఆయనకు సంబంధం లేకుండానే సుడా చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సత్తు మల్లేశంను నియమించారు. వీరిద్దరూ ఒకరు మంత్రి శ్రీధర్బాబు వర్గానికి చెందినవారుకాగా, మరొకరు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సన్నిహితుడు. వీరిద్దరిని పదవీ బాధ్యతలు చేపట్టే విషయంలో కూడా మంత్రి పొన్నం ససేమిరా అన్నా వారు ఆయా చైర్లలో కూర్చున్నారు. మరోవైపు తాను సపోర్టు చేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ తనకు ఎదురు తిరిగి వైరివర్గంలో చేరడం కూడా పొన్నం ప్రభాకర్కు అసహనాన్ని కలిగించింది. వీరందరికి శ్రీధర్బాబు అండగా ఉన్నారనే అభిప్రాయం పొన్నం వర్గంలో పాతుకునిపోయింది. శ్రీధర్బాబు వర్గీయులు దానిని కొట్టి పారేస్తున్నారు. శ్రీధర్బాబు అడపాదడపా ఇక్కడి కార్యక్రమాలకు వస్తున్నా ఇద్దరి మధ్య ఏమాత్రం సయోధ్య ఉండడం లేదు. ఈ ఇద్దరి మంత్రుల వ్యవహారాన్ని ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తలనొప్పిగా భావిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ పలు వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన తన పరిస్థితి ఏమిటో పార్టీ స్పష్టం చేయాలని, సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేదా తేల్చాలని పట్టుబడుతున్నారు.
ఏర్పాటు కాని ఇందిరమ్మ కమిటీలు
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఇన్చార్జి మంత్రికి పంపి ఆమోదం పొందితేనే నియోజకవర్గంలో ప్రజలకు ఇళ్ల మంజూరు పత్రాలు అందుతాయి. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ప్రజలకు అందిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడు మంజూరి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. జిల్లాకు వస్తే ఈ పరిస్థితులన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని, అందకే ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.