Share News

తప్పని ఎదురుచూపులు

ABN , Publish Date - May 18 , 2025 | 12:31 AM

వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డురకంతో పాటు సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నప్పటికీ బోనస్‌ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పని ఎదురుచూపులు

జగిత్యాల, మే 17 (ఆంధ్రజ్యోతి): వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డురకంతో పాటు సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నప్పటికీ బోనస్‌ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హామీఇచ్చిన విధంగా క్వింటాలుకు రూ. 500 బోనస్‌ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

ఫసన్నాల సాగు..

జిల్లా వ్యాప్తంగా వరి సాగు బాగా పెరిగింది. సాధారణంగా జిల్లా రైతులు వానాకాలం సీజన్‌లో సన్నాలు, యాసంగిలో దొడ్డురకం పండిస్తారు. అయితే ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్‌లోనూ కొందరు రైతులు సన్నాలు సాగు చేశారు. జిల్లాలో అక్కడక్కడ సన్నాలను కేంద్రాల్లో రైతులు విక్రయించారు. అయితే కేవలం రెండు, మూడు రోజుల్లోనే రైతులకు పూర్తి స్థాయిలో ధాన్యం డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమ అయ్యేందుకు కనీసం వారం రోజులు పడుతుండగా, బోనస్‌ డబ్బులు 15 రోజులు దాటినా పడడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్‌ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

ఫఆందోళనలో రైతులు

వాస్తవానికి కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూశాక నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు కేంద్రాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజులు సమయం పడుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసి పక్షం రోజులు గడిచినా బోనస్‌ మాత్రం రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్‌ అమలు చేస్తుందా లేదా అని రైతులు అయోమయానికి గురవుతున్నారు.

ఫజిల్లాలో సన్నరకం కొనుగోళ్లు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 61 సన్నరకం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఈనెల 13వ తేదీ వరకు రూ.603.27 కోట్ల విలువ గల 2,60,029.780 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 42,078 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఇందులో రూ.1.33 కోట్ల విలువ గల 574.980 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యాన్ని 84 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 29 మంది రైతులకు చెందిన 307.880 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యానికి చెందిన రూ.71లక్షల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

బోనస్‌ పడలేదు

-సురకంటి స్వామి రెడ్డి, రైతు, ఎండపల్లి

సన్నరకం వరి ధాన్యానికి చెందిన బోనస్‌ డబ్బులు పది రోజులు దాటినా రావడం లేదు. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 188.80 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ వడ్లను గత నెల 30వ తేదీన ఎండపల్లి కేంద్రంలో విక్రయించా. ఇందులో క్వింటాలుకు రూ.2,320 చొప్పున ధాన్యం డబ్బులు వచ్చాయి. సన్నరకం ధాన్యానికి చెందిన బోనస్‌ ఇప్పటివరకు పడలేదు.

అధికారులు స్పందించాలి

-సిరికొండ గంగన్న, రైతు, బుగ్గారం

బుగ్గారం కొనుగోలు కేంద్రంలో 76.80 క్వింటాళ్ల సన్నరకం వరి ధాన్యాన్ని విక్రయించా. ఇందుకు గాను రూ.38,400 బోనస్‌ డబ్బులు రావాల్సి ఉంది. పది రోజులుగా ఎదురుచూస్తున్నప్పటికీ బోనస్‌ డబ్బులు రావడం లేదు. బోనస్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా.

బోనస్‌ డబ్బులు జమ అవుతాయి

-జితేంద్ర ప్రసాద్‌, డీఎం, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌

కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సంబంధిత రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేస్తున్నాం. ఒకటి, రెండు రోజుల్లో బోనస్‌ డబ్బులు కూడా జమ చేస్తాం. మద్దతు ధరతో ప్రతి ఒక్క గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు.

Updated Date - May 18 , 2025 | 12:31 AM