Share News

నిరాశలో కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:54 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో తమ దశ మారుతుందని ఆశపడ్డ కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడు పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో పడిపోయాయి. ఎన్నికలకు ముందుగాని మళ్లీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేనందువల్ల ఈ నియోజకవర్గం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదనే భావనతో డీలా పడుతున్నారు.

నిరాశలో కాంగ్రెస్‌ శ్రేణులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో తమ దశ మారుతుందని ఆశపడ్డ కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడు పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో పడిపోయాయి. ఎన్నికలకు ముందుగాని మళ్లీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేనందువల్ల ఈ నియోజకవర్గం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదనే భావనతో డీలా పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొన్నటి వరకు ఉన్న ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా నియోజకవర్గంలో ఎవరికి నామినేటెడ్‌ పదవులు దక్కక, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పడక, ఇళ్లు మంజూరు కాక మరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారానికి నోచుకోక పార్టీ పరిస్థితి ఇటు నియోజకవర్గ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం ఉన్నది. మంత్రివర్గ విస్తరణలో మానకొండూర్‌ శానససభ్యుడు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి దక్కితే ఈ జిల్లాకు నేరుగా మంత్రి పదవి వచ్చి అతని నేతృత్వంలో ప్రస్తుత పరిస్థితులకు పుల్‌స్టాప్‌ పడుతుందని ఆశించారు. ఆఖరు నిమిషం వరకు ఆయనే ప్రతిపాదనలో ఉన్నా చివరి క్షణంలో అదికాస్తా మారి జగిత్యాల జిల్లాకు చోటు దక్కింది. దీంతో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షునిగా ఉన్న సత్యనారాయణ కొంత చురుకుగా వ్యవహరిస్తూ కార్యకర్తల సమస్యలను పట్టించుకునేవారని, ఇప్పుడు ఆయన కూడా అసంతృప్తికి లోనై ఉండడంతో తమకు ఎంతవరకు అండగా ఉంటారన్నది తెలియక పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.

ఫ మంత్రుల ఆధిపత్యపోరే కారణమా?

ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కూడా ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరే కారణమనే అభిప్రాయం పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో, కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసిమెలిసి ఉంటూ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాలుపంచుకునే కవ్వంపల్లి సత్యనారాయణ కొద్ది నెలలుగా వారిద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలతో ప్రభాకర్‌కు దూరమయ్యారు. శత్రువు శత్రువు మనకు మిత్రుడు అన్నట్లు కవ్వంపల్లి కాస్త శ్రీధర్‌బాబు శిబిర వర్గీయుడిగా ముద్రపడ్డారు. ఆయన శ్రీధర్‌బాబుతో ఎంతవరకు కలిసి పనిచేశారో లేదోకానీ ఇప్పుడు శ్రీధర్‌బాబు అండదండలు కూడా ఆయనకు లభించలేదనే అంటున్నారు. శ్రీధర్‌బాబు తమ జిల్లా రాజకీయ నేపథ్యం రీత్యా ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కే మంత్రి పదవి దక్కాలని భావించారని, అందుకు తన సపోర్టు కూడా సంపూర్ణంగా అందించడంతోనే లక్ష్మణ్‌ కుమార్‌ మంత్రి అయ్యారని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్‌ కవ్వంపల్లికి మంత్రి పదవి రాకుండా తన శక్తి మేరకు పనిచేశారని కవ్వంపల్లి వర్గీయులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు మంత్రుల రాజకీయాలు కవ్వంపల్లికి అనుకూలంగా లేకపోవడంతో ఆయన మంత్రి పదవి అందినట్లే అంది దూరమయిందని వారంటున్నారు.

ఫ కరీంనగర్‌ నియోజకవర్గంలో ముందుకు సాగని పనులు

కవ్వంపల్లికి మంత్రి పదవి దక్కితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నడిపించడానికి పూర్తికాలపు నేతగా ఉండేవారని అంతేకాకుండా జిల్లా కేంద్ర నియోజకవర్గమైన కరీంనగర్‌కు పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే లేనిలోటు తీర్చేవారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉన్నది. ఇప్పుడు ఆ అవకాశం చేజారిపోవడంతో మరింత డీలా పడుతున్నారు. సుడా చైర్మన్‌గా కరీంనగర్‌ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి ఉన్నా ఆయన మంత్రి పొన్నం వ్యతిరేక శిబిరానికి చెందినవ్యక్తి కావడం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశంకు కూడా మంత్రితో సఖ్యత లేకపోవడంతో వారి వద్దకు వెళితే మంత్రి పొన్నంకు ఆగ్రహం కలిగించినవారమవుతామని దూరం ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని, మంత్రి వద్దకు వెళ్లినా ఆయన తన శాఖాపరమైన పనులతోపాటు తన నియోజకవర్గ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కరీంనగర్‌ నియోజకవర్గ శ్రేణులు వాపోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తయి నిర్మాణాలు చేపడుతున్నా కరీంనగర్‌ నియోజకవర్గానికి మాత్రం ఆ భాగ్యం దక్కడం లేదని, అలాగే నామినేటెడ్‌ పదవులు భర్తీకావడం లేదని జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెట్‌ కమిటీకి కూడా పాలకవర్గాన్ని నియమించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని శ్రేణులు అంటున్నాయి. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పలువురి పేర్లను పరిశీలించి విచారణ కూడా జరిపి నివేదికలు పంపించినా అధ్యక్షుడిని నియమించలేదని పూర్తికాలం పార్టీ వ్యవహారాలకు కేటాయించే వ్యక్తికి ఈ పదవి ఇవ్వడంతో పాటు ఆయన మంత్రులను సమన్వయపరుచుకునే స్థాయి ఉన్న వ్యక్తి అయి ఉంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాంటి వ్యక్తిని డీసీసీ అధ్యక్షునిగా నియమించాలని కోరు తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కవ్వంపల్లినే ఆ పోస్టులోనే కొనసాగిస్తూ మంత్రుల స్థాయి ఉండే చీఫ్‌ విప్‌ లాంటి పదవిని అప్పగిస్తే మంత్రులను సమన్వయ పర్చుకోవడమో, ఇండిపెండెంట్‌గానైనా జిల్లా కాంగ్రెస్‌ వ్యవహారాలను చూస్తూ కరీంనగర్‌ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా పార్టీలోని కొందరు నేతలు, కరీంనగర్‌ నియోజకవర్గ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Jun 14 , 2025 | 12:54 AM