KCR vs Kavitha: కవిత సంచలనం నిర్ణయం.. కేసీఆర్కు ఏం చెప్పారంటే..!
ABN , Publish Date - May 27 , 2025 | 06:05 PM
బీఆర్ఎస్లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు రావడంతో మొదలైన ఈ పొలిటికల్ సైక్లోన్.. మరింత తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి పార్టీని కాదని..

హైదరాబాద్, మే 27: బీఆర్ఎస్లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు రావడంతో మొదలైన ఈ పొలిటికల్ సైక్లోన్.. మరింత తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి పార్టీని కాదని కొత్త పార్టీ స్థాపించాలని ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని కేసీఆర్ పంపిన దూతలకు కూడా తేల్చి చెప్పారట. అంతేకాదు.. జూన్ 2న కొత్త పార్టీపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు బయట ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె ఏ సభ, సమావేశాల్లో పాల్గొన్నా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగానే కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వరంగల్ సభ తరువాత పార్టీ తీరుపై కేసీఆర్కే నేరుగా లేఖ రాశారు. ఈ లేఖ లీక్ అవడంతో.. తెలంగాణ రాజకీయం షేక్ అయ్యింది. ఆ తరువాత పరిణామాలు కూడా చాలా హీట్ క్రియేట్ చేశాయి. అమెరికా నుంచి వచ్చిన కవిత.. ఎయిర్పోర్టులోనే మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ తాను రాసిందేనని కన్ఫామ్ చేసిన ఆమె.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ బాంబ్ పేల్చారు. ఇక కవిత లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. కవితకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
దూతలతో మంతనాలు..
పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో కవిత వద్దకు కేసీఆర్ తన దూతలను పంపించారు. కవిత అసంతృప్తికి గల కారణాలపై చర్చించారు. అయితే, వీరి చర్చలు సైతం విఫలమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తనకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేకుంటే తన దారి తాను చూసకుంటానని కేసీఆర్కు కవిత స్పష్టం చేశారట. కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచనలతో ఉన్నట్లు స్పష్టం చేశారట.
జూన్ 2న కొత్త పార్టీ..
ఇదిలా ఉంటే.. కవిత బీఆర్ఎస్ను వీడి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఇక ఆ పార్టీలో ఉండాలనుకోవడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కవిత వరుసగా పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని అంటున్నరు. ఇప్పటికే జాగృతిని విస్తరిస్తూ పలు కొత్త కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. వరుసగా జాగృతి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కమిటీలను ప్రకటిస్తున్నారు. మంగళవారం నాడు సింగరేణి జాగృతి కమిటీని కవిత ప్రకటించారు. తొమ్మిది మంది కన్వీనర్లను నియమించారు. బహుజన సామాజిక న్యాయం ట్యాగ్ లైన్తో ప్రజల్లోకి వెళ్లాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.
ప్రతిపక్షాలు సైతం..
కవిత కొత్త పార్టీ పెడతారని.. జూన్ 2వ తేదీన కొత్త పార్టీని ఆమె ప్రకటిస్తారని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీలిక ఖాయం అని, కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించడం లేదంటున్నారు. ఈ కారణంగానే ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నట్లు ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు.
Also Read:
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు!
For More Telangana News and Telugu News..