Share News

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:21 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

  • ఆయనతో పాటు నాటి మంత్రి వర్గమూ కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది

  • తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది

  • అక్కడ నీటి లభ్యత లేదంటూ సీడబ్ల్యూసీ లేఖ రాసింది

  • తాగు, సాగు నీటి అవసరాల రీత్యానే ప్రాజెక్టు రీడిజైన్‌

  • కాళేశ్వరం తొలి అంచనా వ్యయం రూ.60 వేల కోట్లే..

  • ఆ తర్వాత పలు మార్పులతో రూ.80 వేల కోట్లకు: ఈటల

  • కాళేశ్వరం కమిషన్‌ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబులు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఎదుట ఆయన హాజరయ్యారు. 18నిమిషాల పాటు కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు. ‘‘రూ.38వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతోపాటు అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అప్పట్లో లేఖ రాసింది. 152అడుగుల ఎత్తులో తుమ్మిడిహెట్టి కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 148 అడుగులకు తగ్గించుకుంటే హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 15 టీఎంసీలు, గ్రామీణ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు క లుపుకొని ప్రతిపాదిత 16.6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించలేని పరిస్థితుల్లో ప్రాణహిత-చేవెళ్లను రీడిజైన్‌ చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి నీరు తీసుకోలేమని తెలిసే హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాం. ఆ నివేదికను నీటి పారుదల శాఖ పరిశీలించి, నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదన దశలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.60వేల కోట్లే. కాలక్రమంలో రైతుల విజ్ఞప్తులతో పలు మార్పుల అనంతరం అది రూ.80వేలకోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఎంతకు చేరిందో నాకు తెలియదు’’ అని పేర్కొన్నారు.


కమిషన్‌: కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిది?

ఈటల: 2014 జూన్‌ 2 నుంచి 2018 డిసెంబరు 18 దాకా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా. కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని అప్పటి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రివర్గమంతా కలిసి నిర్ణయించింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఫలానా చోట కట్టాలని చెప్పిందెవరు?

గోదావరిలో పలు చోట్ల బ్యారేజీల కోసం సాంకేతిక అధ్యయనాలు జరిగాయి. అధ్యయనాల అనంతరం అంతిమంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో కట్టాలని సాంకేతిక నిపుణులు చెప్పారు.


కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రాజెక్టు నుంచి జనరేట్‌ అయ్యే నిధుల నుంచి రుణాలు తిరిగి చెల్లిస్తామని విజయ బ్యాంకుకు చెప్పారా?

ప్రభుత్వం వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి సరిపడా నిధులు లేనందువల్ల నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణాలు తీసుకోవడానికి అవసరమైన గ్యారంటీలపైనే ప్రభుత్వం సంతకాలు చేసింది. అయితే ప్రతిపాదిత తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీటిపై చార్జీలు వసూలు చేసి, రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నాం. కానీ తాగునీటికి చార్జీలు వసూలు చేయలేదు. 2018 తర్వాత బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులను సమీకరించుకొని కాళేశ్వరం కార్పొరేషనే చెల్లింపులు చేసుకుంది.

బ్యారేజీల నిర్మాణ స్థలాలను మీరు వ్యతిరేకించారా?

ఏ నిర్ణయమైనా నీటి పారుదల శాఖలోని సాంకేతిక కమిటీ మాత్రమే తీసుకోగలదు.

ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనేది వాస్తవమేనా?

నీటిపారుదల శాఖకు సొంతంగా ఆర్థిక విభాగం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ బాధ్యత ఆ విభాగానిదే.


కాళేశ్వరం సమాచారమంతా కేసీఆర్‌, హరీశ్‌ వద్దే ఉంది

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారమంతా కేసీఆర్‌, హరీశ్‌ వద్దే ఉందని ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా ఏమీ లేదని చెప్పారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలకు కట్టుబడే ఉన్నానని, తన కణతపై తుపాకీ పెట్టినా నిజాలే చెప్తానని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్‌ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేఖతోపాటు సాంకేతిక కమిటీ సిఫారసులతో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా చేపట్టిన పరీక్షల వివరాలతోపాటు కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు. కాళేశ్వరం సృష్టికర్త కేసీఆరేనని, తాను కాదని గుర్తుచేశారు. కాగా, జస్టిస్‌ ఘోష్‌ తనతో వ్యవహరించిన తీరు పట్ల ఈటల సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విచారణలో తనకు సముచిత గౌరవం లభించినట్టు ఈటల తన సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.


మహేశ్‌గౌడ్‌వి అవగాహనలేని దద్దమ్మ మాటలు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌.. అవగాహన లేని దద్దమ్మలా మాట్లాడుతున్నారని ఈటల మండిపడ్డారు. తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణానికి, ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఇరిగేషన్‌ శాఖలో అకౌంట్‌ ఆడిట్‌ డిపార్టుమెంట్‌ బిల్లులు పంపిస్తే ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేస్తారే తప్ప మంత్రి వరకు రాదని వివరించారు. బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చయితే.. మంత్రివర్గ ఆమోదం తీసుకుని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇవేమీ తెలియకుండా మాట్లాడేవారిని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదన్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి కుటుంబ సభ్యులు 10శాతం కమీషన్‌ చెల్లిస్తేనే బిల్లులు ఇస్తున్నట్టు తెలిసిందని, తాను మంత్రిగా ఉన్నప్పుడు అలాంటిదెప్పుడూ జరగలేదని వివరించారు. హరీశ్‌రావును తాను కలిసినట్లు దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మాదిరిగానే.. ఇప్పుడు కాంగ్రెస్‌ హయాంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 04:21 AM