Share News

Maganti Gopinath: వెంటిలేటర్‌పై మాగంటి

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:44 AM

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Maganti Gopinath: వెంటిలేటర్‌పై మాగంటి

తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే గోపీనాథ్‌.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

  • పరిస్థితి విషమం అంటున్న బీఆర్‌ఎస్‌ వర్గాలు

  • ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మాజీ మంత్రి హరీశ్‌రావు, నేతలు

  • త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి

  • సన్నిహితుడి ఆత్మహత్యతో మానసిక ఒత్తిడి: దాసోజు

  • విషయం తెలిసి అమెరికా నుంచి తిరిగొస్తున్న కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న గోపీనాథ్‌ను వైద్యులు పరీక్షించి.. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. దీనితో వైద్యులు వెంటనే ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స ప్రారంభించారు. గోపీనాథ్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, రాజ్‌ ఠాకూర్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తదితరులు ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు చేస్తున్న చికిత్స తదితర వివరాలను తెలుసుకున్నారు. గోపీనాథ్‌ తీవ్రంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు లోనయ్యారు.


కొంతకాలం నుంచి అనారోగ్యంతో..

మాగంటి గోపీనాథ్‌ కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మార్చిలో మూత్రపిండాల (కిడ్నీ) సమస్యకు ఏఐజీలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడటంతో నెల రోజులుగా నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జూన్‌ 2న ఆయన పుట్టినరోజు కాగా.. ఇటీవల ఆయన సన్నిహిత బీఆర్‌ఎస్‌ నాయకుడు సర్దార్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదు.


సర్దార్‌ ఆత్మహత్యతో మానసిక ఒత్తిడి..

సీనియర్‌ వైద్యుల బృందం గోపీనాథ్‌కు చికిత్స అందిస్తోందని, 48 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉందని వైద్యులు తెలిపారని హరీశ్‌రావు చెప్పారు. దేవుడి దయతో ఆయన పూర్తిగా కోలుకుంటారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇక మాగంటి గోపీనాథ్‌కు సన్నిహితంగా ఉండే బీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం కీలక నేత మహ్మద్‌ సర్దార్‌ ఈ నెల 23న ఆత్మహత్య చేసుకున్నారని, దానితో గోపీనాథ్‌ మానసిక ఒత్తిడికి లోనయ్యారని దాసోజు శ్రవణ్‌ చెప్పారు. బోరబండ కార్పొరేటర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ వేధింపులతోనే సర్దార్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఆ ఆధారాలను పోలీసులకు అందజేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గోపీనాథ్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. బాబా ఫసియుద్దీన్‌పై స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సర్దార్‌ ఆత్మహత్యతో మాగంటి తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు.


హైదరాబాద్‌కు తిరిగొస్తున్న కేటీఆర్‌..

మాగంటి అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. అమెరికా పర్యటనను కుదించుకుని, హైదరాబాద్‌కు బయల్దేరారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులు, ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో కేటీఆర్‌ అక్కడి నుంచే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, గోపీనాథ్‌ ఆరోగ్యం మెరుగుపడే అవకాశముందని వైద్యులు వెల్లడించారని కేటీఆర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 03:44 AM