Jagga Reddy: ఇండియా అంటే.. ఇందిర!
ABN , Publish Date - May 13 , 2025 | 04:44 AM
ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

వాజపేయి అంతటివాడే.. అపరకాళి అన్నారు
అమెరికా ఒత్తిడిని లెక్కచేయకుండా.. పాక్పై యుద్ధం చేసిన వీరనారి
ప్రస్తుత యుద్ధం కంటే నాడు ఇందిర చేసిన యుద్ధంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది
రాహుల్ నాయనమ్మ చరిత్ర అలాంటిది
బీజేపీవాళ్లకు ఆ కుటుంబంపై ఏడుపు
ఈటల రాజేందర్ పెద్ద నసగాడు..
అందుకే కేసీఆర్బయటికి పంపారు
నేను 19 ఏళ్లకే కౌన్సిలర్ను అయ్యాను
అప్పుడు ఈటల చదువుతుండొచ్చు!
ఇప్పుడు తన పర్సనాలిటీ పెద్దదని ఫీలైతే ఎట్లా?
నాది ఈటల లాగా హైబ్రీడ్ రాజకీయం కాదు.. నాటు రాజకీయం: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో.. పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. 1971 యుద్ధ సమయంలో విపక్షాలు సైతం మెచ్చుకునేలా ఇందిర నిర్ణయాలు తీసుకున్నారని, ఆమె ధైర్యాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుందని తెలిపారు. అప్పట్లోనూ ఆ యుద్ధాన్ని ఆపాలని అమెరికా ఒత్తిడి చేసిందని, అయినా లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించిన వీరనారి ఇందిర అని కొనియాడారు. తమ దేశ ప్రజలకు సంబంధించిన నిర్ణయంలో తలదూర్చొద్దంటూ అమెరికాకు ఇందిర స్పష్టం చేశారని, దాంతో పాక్ ప్రధాని తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాజపేయి అంతటి నాయకుడే.. పార్లమెంటు సాక్షిగా ఇందిరాగాంధీని అపరకాళితో పోల్చారని గుర్తు చేశారు. గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇందిరాగాంధీ ఏదైనా సభకు వస్తున్నారంటే.. 3 రోజుల ముందే జనం అక్కడ ఉండేవారని తెలిపారు. తన చిన్నతనంలో.. ఇంట్లోని పూజగదిలో దుర్గామాత ఫొటో పక్కన ఇందిరమ్మ ఫొటోనూ పెట్టి తన తల్లి పూజ చేసేవారని గుర్తు చేసుకున్నారు. రాహుల్గాంధీ నాయనమ్మ చరిత్ర అలాంటిదన్నారు. కానీ, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం అమెరికా వద్దంటే పాకిస్థాన్తో యుద్ధాన్ని ఆపేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ వారికి రాహుల్ కుటుంబంపై ఏడుపు ఎక్కువ, చేతలు తక్కువ అని విమర్శించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎ్సలో ఉన్నప్పుడు పెద్ద నసగాడు అని, అందుకే ఆయనను కేసీఆర్ బయటికి పంపించాడని జగ్గారెడ్డి అన్నారు. ‘‘ఈటల రాజేందర్.. రండ అంటూ మాట్లాడారు. ఆ పదానికి అర్థమేంటో చెబితే.. దానికి సమాధానమిస్తాను. 19 ఏళ్లకే సంగారెడ్డి మునిసిపల్ కౌన్సిలర్ను అయ్యాను. అప్పుడు ఈటల రాజేందర్ చదువుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు తన పర్సనాలిటీ పెద్దదని ఫీలైతే ఎలా?’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో సైతం ఈటల తన కంటే చిన్నపిల్లవాడన్నారు. తన సంగతి తెలియాలంటే కిషన్రెడ్డిని, వెంకయ్యనాయుడును, భగవంత్రెడ్డిని అడగాలని సూచించారు. ఈటల లాగా తనది హైబ్రీడ్ రాజకీయం కాదని, నాటు రకమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News