Share News

Jagga Reddy: సీఎం రేవంత్‌ను ప్రశ్నించే హక్కు నీకు లేదు

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:40 AM

సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించే హక్కు, స్థాయి కేటీఆర్‌కు లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్‌, ఆయన బావ హరీశ్‌రావు సెకెండ్‌ బెంచ్‌ లీడర్లని పేర్కొన్నారు.

Jagga Reddy: సీఎం రేవంత్‌ను ప్రశ్నించే హక్కు నీకు లేదు

  • ప్రశ్నించాలనుకుంటే కేసీఆర్‌తో విపక్ష నేత పదవికి రిజైన్‌ చేయించు

  • ఆ పదవి తీసుకుని ప్రశ్నించు.. అప్పుడు నీ మాటను పరిగణిస్తాం

  • కేటీఆర్‌కు జగ్గారెడ్డి సూచన

  • రేవంత్‌ గురువు బాబు అని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు

  • కేసీఆర్‌కూ ఆయన గురువే

  • ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేప్పుడు.. వైస్రాయ్‌ హోటల్‌ ఇన్‌చార్జిగా పని చేసింది కేసీఆర్‌ కాదా?

  • కేసీఆర్‌కు బాబు మంత్రి పదవి ఇచ్చింది అందుకు కాదా?: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించే హక్కు, స్థాయి కేటీఆర్‌కు లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్‌, ఆయన బావ హరీశ్‌రావు సెకెండ్‌ బెంచ్‌ లీడర్లని పేర్కొన్నారు. చర్చ కోసం అసెంబ్లీ పెడతాను సభకు రావాలంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను రేవంత్‌ కోరితే.. ప్రతిపక్ష నేత మాట్లాడకుండా మధ్యలో ఈ సెకెండ్‌ బెంచ్‌ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్‌ను ప్రశ్నించాలని, సవాల్‌ విసరాలని కేటీఆర్‌కు ఉంటే.. ముందుగా కేసీఆర్‌తో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయించాలని సూచించారు. ఆ పదవిని కేటీఆర్‌ తీసుకుని సవాల్‌ విసరాలని, అప్పుడే ఆయన మాటకు విలువ ఉంటుందని, తామూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అంతేగానీ.. అనవసరంగా రేవంత్‌కు సవాళ్లు విసిరి పలుచన కావొద్దని సూచించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. సహజంగా ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటూ ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌ చేస్తుందని, కానీ తెలంగాణ లో మాత్రం దానికి రివర్స్‌గా ఉందన్నారు. ‘‘అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌ పిలుస్తుంటే.. బోట్స్‌ క్లబ్‌కు, ప్రెస్‌ క్లబ్‌కు రమ్మని కేటీఆర్‌ అంటుండు.


ఇంకా రెండు రోజులైతే కల్లు దుకాణానికి రమ్మంటాడేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చిస్తారో సాధారణ పౌరుడిని అడిగినా చెబుతాడన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో దుర్మార్గంగా పాలించారని, రేవంత్‌ ఇంట్లో ఫోన్లు ట్యాప్‌ చేశారన్నారు. ‘‘రేవంత్‌ను పట్టుకుని చంద్రబాబు శిష్యుడంటూ కేటీఆర్‌ మాట్లాడుతున్నడు. మరి.. కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయనకు గురువు కూడా చంద్రబాబు కాదా? ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు కీలకంగా పని చేసింది.. వైస్రాయ్‌ హోటల్‌ ఇన్‌చార్జిగా ఉన్నది కేసీఆర్‌ కాదా? అందుకనే కేసీఆర్‌కు చంద్రబాబు.. మంత్రి పదవి ఇచ్చింది నిజం కాదా?’’ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్‌లు యూత్‌ కాంగ్రెస్‌ నేతలుగా ఉన్నప్పుడు వారిద్దరూ వి. హన్మంతరావు కింద పనిచేశారన్నారు. రవాణా మంత్రిగా ఉన్నప్పుడు.. చిన్న రాష్ట్రాలతో ఉపయోగం లేదన్న కేసీఆర్‌.. ఆ తర్వాత ఆంధ్రావాళ్లను తిట్టారని, మళ్లీ గ్రేటర్‌ ఎన్నికలు రాగానే ఆంధ్రావాళ్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని మాట్లాడారన్నారు. ఏ పూటకు ఆ మాట మాట్లాడే వారు కూడా తమకు రాజకీయాలు చెప్పేవారయ్యారని విమ ర్శించారు. అసలు నీటి పంచాయతీని తెచ్చిందే బీఆర్‌ఎస్‌ సర్కారు అని ఆరోపించారు. నీళ్ల దొంగతనం చేసిన వారిని ఇంటికి పిలిచి మీటింగ్‌ పెట్టింది కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. కవిత.. రైల్‌ రోకో కాకుంటే.. ఫ్లైట్‌ రోకో చేసుకోవచ్చునన్నారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 03:40 AM