MLC Kavitha: తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:02 PM
MLC Kavitha: ఆ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని.. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సీఎంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని, ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

Hyderabad: ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు (Polavaram project)తో తెలంగాణ (Telangana)కు ముంపుపై శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం (Telangana Jagruthi Round Table Meet) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు.
భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు
ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని, ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత అన్నారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదంటే ఎప్పుడైనా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందన్నారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని, ఆ వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకు పోయిందన్నారు. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడని.. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందన్నారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత అన్నారు.
అవసరమైతే న్యాయ పోరాటం...
అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నారు. 2014లో ప్రధాని మోదీ మొట్ట మొదటి క్యాబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ను ఆమోదించి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. ఆ ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నారు. లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని... బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని విమర్శించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో మేము గళమెత్తామన్నారు. కేసీఆర్ బంద్కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా లేదన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
కేసీఆర్ను విలన్ చేసే ప్రయత్నం..: ఎంపీ చామల కిరణ్
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్డే శుభాకాంక్షలు
For More AP News and Telugu News